అఖిల్ భారం చిరు మీద..

హీరోగా అఖిల్ అక్కినేని కెరీర్లో తొలి మూడు చిత్రాలు డిజాస్టర్లు. నాలుగో సినిమా ఓ మోస్తరుగా ఆడిందంతే. ఇలాంటి ట్రాక్ రికార్డున్న హీరో మీద 50 కోట్ల బడ్జెట్ పెట్టి ‘ఏజెంట్’ సినిమా తీస్తున్నట్లు నిర్మాత అనిల్ సుంకర ప్రకటించినపుడు అందరూ షాకయ్యారు. అఖిల్‌కు ఏం మార్కెట్ ఉందని ఇంత సాహసం చేస్తున్నాడని అనుకున్నారు. ఐతే సురేందర్ రెడ్డి దర్శకుడు కావడం, మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండటంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని, అఖిల్‌కు మాస్ ఇమేజ్ తెచ్చి పెడుతుందని ఆశలు కలిగాయి. రిలీజ్ ముంగిట సినిమాకు హైప్ బాగానే వచ్చింది. మార్నింగ్ షోలకు థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. కానీ బొమ్మ పడ్డాక కథ మారిపోయింది. డిజాస్టర్ టాక్‌ రావడంతో మ్యాట్నీల నుంచి థియేటర్లు వెలవెలబోయాయి. సినిమా అనౌన్స్‌మెంట్‌ టైంలో బడ్జెట్ రూ.50 కోట్లయితే.. రిలీజ్ టైంకి అది రూ.80 కోట్లయింది. తీరా చూస్తే అందులో పదో వంతు షేర్ కూడా రాలేదు.

‘ఏజెంట్’ను కొన్న బయ్యర్లు నిండా మునిగిపోయి.. రిలీజ్ తర్వాత కొన్ని రోజుల నుంచి నష్ట పరిహారం కోసం నిర్మాత అనిల్ సుంకర మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆయన పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే డెఫిషిట్‌తోనే సినిమాను రిలీజ్ చేసినప్పటికీ.. బయ్యర్లకు భారీగానే దెబ్బ పడింది. ఆల్రెడీ నష్టాల్లో ఉన్న అనిల్.. బయ్యర్లకు ఎంతో కొంత సెటిల్ చేయాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. కొన్ని రోజులుగా సెటిల్మెంట్ చర్చలు నడుస్తున్నాయి. పరిహారం ఇవ్వడానికి బదులు.. తన కొత్త చిత్రం ‘భోళా శంకర్’తో లింకు పెడుతున్నారట అనిల్.

ఆ సినిమా హక్కులను కొంచెం తక్కువకు అదే బయ్యర్లకు ఇస్తానని.. ‘ఏజెంట్’ నష్టాలను ‘భోళా శంకర్’తో భర్తీ చేసుకోవచ్చని ప్రతిపాదిస్తున్నారట. మామూలుగా దిల్ రాజు తన రెగ్యులర్ బయ్యర్లతో ఇలాంటి డీల్సే చేస్తుంటారు. ఏదైనా సినిమా పోతే.. తర్వాతి సినిమా రైట్స్ కొంచెం తక్కువకు ఇవ్వడం, ఆ చిత్రం హిట్టయితే పాత నష్టాలు కవర్ అయిపోతుంటాయి. అనిల్ కూడా ఇలాగే ‘భోళా శంకర్‌’తో ‘ఏజెంట్’ నష్టాలను భర్తీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.