ప్రభాస్ మళ్లీ సెంచరీ కొట్టబోతున్నాడా?

‘బాహుబలి’తో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎన్ని రెట్లు పెరిగిందో తెలిసిందే. ‘బాహుబలి’ మెగా సక్సెస్‌లో రాజమౌళిదే మేజర్ క్రెడిట్ అయినప్పటికీ.. ప్రభాస్ పాత్రను తక్కువ చేయలేం. ఒక చిన్న సినిమా తీసిన దర్శకుడు తీసిన ‘సాహో’ మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్స్ రాబట్టిందంటే అది ప్రభాస్ క్రేజ్ వల్లే. కాకపోతే సినిమా అంచనాలను అందుకోలేకపోవడంతో అంతిమంగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా మిగిలింది.

కానీ ‘సాహో’కు వచ్చిన హైప్, ఓపెనింగ్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు సినీ ప్రియులు. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమాతోనూ తొలి రోజే వంద కోట్ల మైలురాయిని అందుకున్నాడు ప్రభాస్. ఐతే ‘రాధేశ్యామ్’కు ఈ మ్యాజిక్ రిపీట్ కాలేదు. దానికి ఆశించినంత హైప్ రాలేదు. పైగా నెగెటివిటీనే కనిపించింది. దీంతో ‘సాహో’ వసూళ్లలో తొలి రోజు సగం కూడా రాబట్టలేకపోయింది ‘రాధేశ్యామ్’.

కానీ ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’కు వచ్చేసరికి లెక్కలు మారిపోతున్నాయి. ముందు ఈ సినిమాపై నెగెటివిటీ ఉన్నప్పటికీ.. రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అంతా సానుకూలతే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వేసవిలో ఏ భాషలోనూ భారీ సినిమాల సందడి లేకపోవడం, బాక్సాఫీస్ డల్ అయిపోవడం ‘ఆదిపురుష్’కు కలిసొస్తోంది.

దీంతో సినిమాకు ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉంటాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భాషా భేదం లేకుండా దేశమంతా ‘ఆదిపురుష్’ ప్రభంజనం సృష్టించేలా ఉంది. కాబట్టి ప్రభాస్ మళ్లీ డే-1 వంద కోట్ల వసూళ్లు మైలురాయిని అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. అదే జరిగితే ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా మారుతాడనడంలో సందేహం లేదు. ఈ చిత్రం జూన్ 16న, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.