సాములోరు.. ప్ర‌భాస్‌ను ఓ రేంజ్‌లో ఎత్తేశారుగా!

స్వామీజీలు, స‌న్యాసులు అన‌గానే సినిమాల‌కు దూరంగా ఉంటారు. ఆయా ఫంక్ష‌న్ల‌కు కూడా క‌డు దూరంపాటిస్తారు. అయితే.. ఆధునిక ప‌రిస్థితిలో స్వాములు, స‌న్యాసుల‌కు సినిమాలు-రాజ‌కీయాల‌తో అనిభావ సంబంధం ఏర్ప‌డిపోయింది. న‌టులు వెళ్లి వారిని క‌ల‌వ‌డం.. న‌టుల‌ను వీరు కొనియాడ‌డం, రాజ‌కీయ నేత‌లు మిలాఖ‌త్ కావ‌డం.. నేత‌ల‌కు వీరు దిశానిర్దేశం చేయ‌డం వంటివి ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి తిరుప‌తిలో నిర్వ‌హించిన ప్ర‌భాస్ మూవీ ‘ఆదిపురుష్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో త‌ళుక్కుమ‌న్నారు. దీంతో టీవీల ముందు కూర్చున్న‌వారు నోరెళ్ల బెట్టారు. సినిమా పంక్ష‌న్‌లో సాములోరేంటా? అని వారిలో వారే ప్ర‌శ్నించుకున్నారు. ఇక‌, ఈ సంద‌ర్భంగా మైకందుకున్న చిన‌జీయ‌ర్ సాములోరు.. ప్ర‌భాస్‌ను ఓ రేంజ్‌లో ఎత్తేశారు.

చిన‌జీయ‌ర్ అనుగ్ర‌హ భాష‌ణం.. ఇదీ!

‘ప్రియ భగవత్‌ బంధువుల్లారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం.. నిజమైన ‘బాహుబలి’ రాముడు అని నిరూపించడానికే ఈ సినిమా వచ్చింది. ప్రతిఒక్కరి గుండెల్లో రాముడు ఉన్నాడు. అలా ప్రభాస్‌ తనలోని రాముడిని తెరపైకి తీసుకొస్తున్నారు. మానవ జాతికి మార్గాన్ని చూపిస్తున్న మహనీయుడు శ్రీరాముడే. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా, ఈ మట్టిపైన నడిచి పావనం చేసిన ఆదర్శ పురుషుడు’’ అని చెప్పారు.

‘‘మనలోని రాముడిని తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ప్రభాస్‌ ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకంటే లోకానికి మహోపకారం ఉండదు. అలాంటి మంచి పనిచేసే మహనీయులకు ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాను అందిస్తున్న ఓం రౌత్‌కు అభినందనలు. అలాగే చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలి’’ అని చినజీయర్‌ స్వామి అన్నారు.