శర్వా ఒంటరి జీవితానికి శుభం కార్డు

ఫ్యామిలీ హీరో శర్వానంద్ నిన్న రాత్రి ఓ ఇంటివాడైపోయాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ టాప్ ఫైవ్ లిస్టులో ఉన్న శర్వా ఫైనల్ గా రక్షిత మెడలో మూడు ముళ్ళు వేయడంతో ఒంటరి జీవితానికి శుభం కార్డు ఇచ్చేశాడు. జైపూర్ లీలా ప్యాలెస్ లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు స్నేహితులు రామ్ చరణ్, సిద్దార్థ్, అదితి రావు హైదరి తదితరులు హాజరయ్యారు. యువి క్రియేషన్స్, ఎస్విసి క్రియేషన్ల తరఫున ప్రత్యేక అతిథులు వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి హాజరు పరిమితంగా ఉంది. రెండు కుటుంబాల మధ్య సాంప్రదాయ పద్దతులతో వివాహం జరిగింది.

హైదరాబాద్ లో రిసెప్షన్ జూన్ 9న జరగనుంది. దీనికి టాలీవుడ్ తారాతోరణం మొత్తం హాజరవుతుంది. చిరంజీవి బాలయ్యతో మొదలుపెట్టి అడవి శేష్ లాంటి ఇప్పటి హీరోల దాకా అందరితోనూ మంచి బాండింగ్ ఉన్న శర్వా కోసం ఆ రోజు భారీ ఎత్తున కలర్ ఫుల్ కాంబినేషన్లు ఉండబోతున్నాయి. ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంట మాత్రం క్యూట్ గా ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన శర్వానంద్ తిరిగి జూలై నుంచి  అందులో పాల్గొనబోతున్నాడు. కొత్త పెళ్ళకొడుక్కి ఆ మాత్రం గ్యాప్ ఇవ్వాలి  

కెరీర్ పరంగా చూస్తే శర్వానంద్ బ్లాక్ బస్టర్ ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. గత ఏడాది ఒకే ఒక జీవితం విజయం సాధించి రిలీఫ్ ఇచ్చింది కానీ రన్ రాజా రన్ రేంజ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ మధ్య డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్లు కొంత ప్రభావం చూపించినప్పటికీ ఒక పెద్ద హిట్టు పడితే ఇవన్నీ సర్దుకుంటాయి. జీవిత భాగస్వామి వచ్చిన వేళ ఆ రకంగా కలిసి వస్తుందేమో చూడాలి. భర్తగా కొత్త పాత్ర కోసం కొంత టైం తీసుకున్నప్పటికీ చివరికి కుదురుకున్నాడు. ఇక బ్రహ్మచారుల లిస్టులో నెక్స్ట్ ఉన్నది ప్రభాసే. ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వింటామో