2 దశాబ్దాల తర్వాత గురూజీ పాటలు

అదేంటి త్రివిక్రమ్ సినిమాల పాటలు క్రమం తప్పకుండా వింటున్నాం కదా మళ్ళీ ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా. మాటల రచయితగా తన పదాల కనికట్టుతో మాయ చేసే ఈయనలో ఓ లిరిక్ రైటర్ ఉన్నారన్న విషయం వీర ఫ్యాన్స్ కు మాత్రమే గుర్తుంటుంది. నిన్న రిలీజైన గుంటూరు కారం టీజర్ లో వచ్చే బిట్ సాంగ్ రాసింది గురూజీనే. గత ఏడాది భీమ్లా నాయక్ లో లాలా అడవి పులి వచ్చింది కూడా ఈ కలం నుంచే. అయితే త్రివిక్రమ్ పాటలు రాయడం ఇది మొదటిసారి కాదు. ఇరవై ఏళ్ళ క్రితమే తన ప్రాసల మేజిక్ ని ప్రేక్షకులకు రుచి చూపించారు. కానీ జనానికి చేరలేదు

2003లో రవితేజ నమిత హీరో హీరోయిన్లుగా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన సినిమా ఒక రాజు ఒక రాణి. దర్శకుడు యోగి. చక్రి సంగీతం సమకూర్చారు. అందులో మంచి పాటలు పడ్డాయి. స్వరాల వీణ ఈ వేళలోనా అంటూ క్యాచీగా ఉండే సాంగ్స్ తో చక్కని ఆల్బమ్ ఇచ్చారు. అయితే మాస్ మహారాజాకు అప్పుడున్న ఇమేజ్ కి ఇంత సాఫ్ట్ లవ్ స్టోరీలో ఆడియన్స్ చూడలేకపోయారు. దీంతో ఎంత పబ్లిసిటీ ఇచ్చి ప్రమోషన్లు చేసినా ఫలితం దక్కలేదు. పెద్ద క్యాస్టింగ్ ఉన్నా లాభం లేకపోయింది. రామోజీరావు సంస్థ అనే కారణంతో రవితేజ ఎక్కువ ఆలోచించకుండా చేసిన మూవీ ఇదే

పాటలు త్రివిక్రమ్ రాశారన్న టాక్ ఆ టైంలో పబ్లిక్ లోకి బాగా వెళ్ళింది. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఇక అప్పటి నుంచి ఆయన కేవలం మాటలు దర్శకత్వానికి మాత్రమే పరిమితమయ్యారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం లిరిక్ రైటర్ కి పని చెప్పడం విశేషం. ఎడాపెడా చూడం ఇది ఎర్రెక్కించే బేరం,  సరా సరా శూలం సుర్రాంటాది కారం, ఇనుప చువ్వ కౌకు దెబ్బ ఇరగదీసే రవ్వలదెబ్బ అంటూ తన మార్కు ఇందులోనూ చూపించడం విశేషం. దీనికొకటే పరిమితమవుతారా లేక ఇంకో రెండు మూడు పాటలకు కలం విదిలిస్తారా చూడాలి