ఐదు కోట్ల విరాళం.. షారుఖ్‌ను ఇరికించే ప్రయత్నమా?

నిన్నట్నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయోధ్యలో ఇటీవలే భూమిపూజ జరిగిన రామాలయం నిర్మాణం కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ఇచ్చాడన్నదే ఆ వార్త. ముస్లిం అయిన షారుఖ్.. రామ మందిరానికి 5 కోట్ల విరాళం ఇచ్చాడన్న వార్త అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఆ వార్త నిజమే అని నమ్మిన ఓ వర్గం షారుఖ్‌లో ఎంత గొప్ప మత సామరస్యం ఉందో.. ఎంతటి సేవా భావం ఉందో అంటూ పొగిడేసింది. కానీ షారుఖ్ సోషల్ మీడియా అకౌంట్లలోకి వెళ్లి చూసినా.. పెద్ద న్యూస్ ఏజెన్సీల్లో వార్తలు చెక్ చేసినా ఇది నిజం కాదని స్పష్టమవుతోంది. ఇది జస్ట్ రూమర్ అన్న విషయం తేలిపోయింది.

బాలీవుడ్ బడా హీరోల్లో మిగతా హీరోలతో పోలిస్తే షారుఖ్‌లో సేవా భావం తక్కువే అన్నది వివిధ సందర్భాల్లో రుజువైంది. కరోనా టైంలో కూడా షారుఖ్ పెద్దగా విరాళమేమీ ప్రకటించినట్లు వార్తలు రాలేదు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు ఇస్తున్నాడని.. తన భవనాన్ని కోవిడ్ సేవ కోసం అందిస్తున్నాడని వార్తలొచ్చాయి కానీ.. వీటిపై అధికారిక సమాచారాలేమీ రాలేదు.

ఏదైనా పెద్ద ఉపద్రవాలు వచ్చినపుడు అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటారు కానీ.. షారుఖ్ ఈ విషయంలో ఎప్పుడూ వెనుకే. ఇక అతను ముస్లిం పక్షపాతి అనే ఒక అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో షారుఖ్‌ను ఇరుకున పెట్టడానికి కావాలనే ఎవరో ఈ 5 కోట్ల విరాళం వార్త సృష్టించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆ వార్తను షారుఖ్ ఖండించనూ లేడు. అలాగని అంత పెద్ద మొత్తంలో ఓ హిందూ ఆలయానికి విరాళం ఇవ్వనూ లేడు.