పుష్ప-2 టీం బస్సుకు ప్రమాదం

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో ‘పుష్ప-2’ ఒకటి. ఏడాదిన్నర కిందట పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించి ‘పుష్ప’కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని సుకుమార్ రూపొందిస్తున్నాడు. కొన్ని నెలల కిందటే చిత్రీకరణ మొదలుపెట్టిన టీం.. ఒక దాని తర్వాత ఒకటి షెడ్యూళ్లు పూర్తి చేసుకుంటోంది. ఐతే కొత్తగా ఒక షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా.. పుష్ప-2 టీం ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగినట్లు సమాచారం.

విజయవాడ-హైదరాబాద్ హైవేలో నార్కట్ పల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ‘పుష్ప-2’ టీం బస్సు.. ఒక వ్యానును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని సమాచారం. పలువురికి గాయాలు అయినా.. ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ బస్సులో కీలక యూనిట్ సభ్యులెవరూ లేరు. జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు తదితరులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఎవ్వరికీ ప్రాణాపాయం లేకపోవడంతో యూనిట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ‘పుష్ప’ మెజారిటీ షూటింగ్ మారేడుమిల్లిలో జరగ్గా.. పుష్ప-2 షూట్ కూడా అక్కడే చేస్తున్నారు. కొత్త అడవులు, లొకేషన్ల కోసం టీం ఒరిస్సాకు కూడా వెళ్లింది. మారేడుమిల్లి, ఒరిస్సా అడవుల్లో మార్చి మార్చి షూటింగ్ చేసింది.

వైజాగ్‌లో కూడా ఒక షెడ్యూల్ చేశారు. తాజా షెడ్యూల్లో అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ కాంబినేషన్లో సన్నివేశాలు తీసినట్లు సమాచారం. ఫాహద్ డేట్లు అయిపోగానే టీం షెడ్యూల్‌ను ముగించి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయింది. ఈ క్రమంలోనే యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. త్వరలోనే రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ మొదలుపెడతారని సమాచారం.