మెట్రో రైల్లో టెడ్డీ బొమ్మ అరాచకం

ఊర్వశివో రాక్షసివోతో టాక్ పాజిటివ్ గా తెచ్చుకున్నా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అందుకోలేకపోయిన అల్లు శిరీష్ తాజాగా బడ్డీతో రాబోతున్నాడు. కోలీవుడ్ బ్యానర్ స్టూడియో గ్రీన్ నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో సామ్ అంటోన్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. ఇవాళ శిరీష్ బర్త్ డే సందర్భంగా టీజర్ పేరుతో రెండున్నర నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోని విడుదల చేశారు. ధృవ, కృష్ణార్జున యుద్ధంతో పాటు ఇటీవలే ఏజెంట్ కి సంగీతం అందించిన హిప్ హాప్ తమిజా దీనికి మ్యూజిక్ డైరెక్టర్. కాన్సెప్ట్ ఏంటో నీట్ గా క్లూస్ ఇచ్చేశారు. ఆసక్తికరంగానే ఉంది

నగరంలో రౌడీల ముఠా ఒకటి నడుస్తూ మాట్లాడే టెడ్డీ బేర్ బొమ్మను హత్య చేసేందుకు వెతుకుతూ ఉంటుంది. మొదట్లో అందరూ నవ్వుకున్నా ఆ తర్వాత ఇదెంత సీరియస్ మ్యాటరో అది ఎదురయ్యాకే అర్థమవుతుంది. సరిగ్గా మర్డర్ చేసే టైంలో ఓ యువకుడు(అల్లు శిరీష్) అడ్డుపడతాడు. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఆ టాయ్ మెషీన్ గన్ తీసుకుని బులెట్ల వర్షం కురిపిస్తుంది. అసలు ఆ కుర్రాడికి ఈ వయొలెంట్ టెడ్డి బేర్ కి ఉన్న స్నేహం ఏంటి, ఎందుకు విలన్లు వీళ్ళ వెంట పడ్డారు, దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాలి.

పాయింట్ ఆసక్తికరంగానే ఉంది. గతంలో సందీప్ కిషన్ తో ఇదే కాంబినేషన్ లో ప్రకటించిన సినిమానే ఇప్పుడు అల్లు శిరీష్ తో సెట్ చేశారని పోస్టర్ చూడగానే అర్థమైపోయింది. మెట్రో ట్రైన్ లో డిజైన్ చేసిన ఫైట్ గట్రా బాగానే ఉన్నాయి. ఈసారి బొమ్మతో పాటు తమిళ టీమ్ తో జట్టు కట్టిన అల్లు వారసుడు ఎలాంటి ఫలితం అందుకుంటాడా చూడాలి. అజ్మల్ అమీర్, ప్రిశ రాజేష్ సింగ్, ముఖేష్ , మొహమ్మద్ అలీ ఇందులో ఇతర తారాగణం. మరి ఒక హీరో డ్రాప్ అయిన బడ్డీని తీసుకున్న శిరీష్ ఇంకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఈ వేసవిలోనే ఉంటుంది