ఇండియా హౌస్ … అప్పుడే వివాదాలు

రామ్ చరణ్ సమర్పణలో వి మెగా బ్యానర్ తో కలిసి అభిషేక్ అగర్వాల్ నిర్మించబోయే ది ఇండియా హౌస్ ప్రకటన రావడం ఆలస్యం వివాదాలు మొదలైపోయాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. పలు కోణాల్లో విశ్లేషిస్తే మ్యాటర్ అర్థమైపోతుంది. టీజర్ లో వీర్ సావర్కర్ పుట్టినరోజు సందర్భంగా అని ఒక చిన్న లైన్ వదిలారు. ఇప్పటికే మే 28న భారతదేశపు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం పట్ల కాంగ్రెస్ తో సహా చాలా పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందరో స్వతంత్ర సమరయోధులు ఉండగా సావర్కర్ నే ఎందుకు హైలైట్ చేస్తున్నారనేది అపోజిషన్ అభ్యంతరం

నిజానికి సావర్కర్ ఆషామాషీ వ్యక్తి కాదు. బ్రిటిషర్ల మీద ఎన్నో పోరాటాలు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది. వాళ్లకు వ్యతిరేకంగా పుస్తకం రాసినందుకు కారాగారంలో చాలా కాలం మగ్గాల్సి వచ్చింది. అయితే ఇండిపెండెన్స్ వచ్చాక ఆయన పూర్తిగా హిందూ భావజాలం నిండిపోయిన వ్యక్తిగా మారిపోయారు. గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సేకి గతంలో పేపర్ నడపడానికి ఆశ్రయం కల్పించి ఆ దుర్ఘటన సమయానికి ఇద్దరి మధ్య స్నేహం ఉండేదని కొందరు ఆరోపిస్తున్నారు.ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద బుక్కే అవుతుంది

ఇండియా హౌస్ వేదికగా పలు వ్యూహాలు ఇక్కడే రచించబడ్డాయని చెప్పుకుంటారు. ఇప్పుడు నిఖిల్ సినిమాలో పాయింట్ కూడా ఇదే. కాకపోతే ఏ అంశాన్ని టచ్ చేశారన్నది చెప్పలేదు కానీ సావర్కర్ కు సంబంధించినదే అయ్యుంటుంది కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు  చెప్పారనేది మరో వెర్షన్. కేవలం ఫస్ట్ లుక్ కే ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇంత సెన్సేషన్ గా మారితే ఇక రిలీజ్ నాటికి ఎలాంటి మలుపలు  తిరుగుతుందో. యూనిట్ వర్గాలు మాత్రం ప్రస్తుతం స్పందించడం లేదు. అసలు రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకుండా ఆశించడం భావ్యం కూడా కాదు