కూతుర్ని రాష్ట్రంలో అడుగుపెట్టొద్దన్న నటుడు

తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్‌కు ఆయన కూతుళ్లలో ఒకరైన వనితతో ఎప్పట్నుంచో వివాదాలున్న సంగతి తెలిసిందే. విజయ్ కుమార్ భార్య మంజుల ఉన్నంత కాలం ఆ కుటుంబ గొడవలేవీ బయటికి రాలేదు. కానీ ఆమె మరణానంతరం ఆస్తుల పంపకాల విషయంలో కుటుంబ గొడవలు రోడ్డు మీదికి వచ్చేశాయి.

ఒక ఇంటి విషయంలో విజయ్ కుమార్, వనిత మీడియా ముందు రోడ్డు మీద గొడవ పడటం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత కూడా ఈ గొడవలేమీ పెద్దగా సద్దుమణిగినట్లు కనిపించలేదు. తాజాగా ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వనిత.. తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో గొడవ గురించి మీడియాతో మాట్లాడింది. సొంత కుటుంబ సభ్యులే తనను ఇంట్లోంచి గెంటేశారని.. తనను తమిళనాడులో అడుగు పెట్టనివ్వనంటూ తండ్రే బెదిరించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘నా సొంత కుటుంబ సభ్యులే నన్ను వేరు చేశారు. ఇంటి నుంచి బయటికి గెంటేశారు.మా నాన్నకు నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. నాకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని మా నాన్న నా ముఖం మీదే చెప్పేశారు. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. ఆమె ఉన్నపుడు వీళ్లెవ్వరూ మాట్లాడేవారు కాదు. ఆమె చనిపోయాక నన్ను దూరం పెట్టారు.

ఆ సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక నా పిల్లలతో కలిసి కర్ణాటకలోని మైసూరుకు వెళ్లాను. అక్కడ దుర్భర జీవితం గడిపాను. దాదాపు రెండేళ్లు మైసూర్లోనే ఉన్నాను. ఆ టైంలో మా నాన్నకు ఫోన్ చేసి.. ఎందుకు ఇలా వేధిస్తున్నారు, అమ్మ ఉంటే ఇలా జరగనిచ్చేదా అని అడిగితే.. నన్ను తమిళనాడులో అడుగు పెట్టనివ్వనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఇక్కడ అడుగు పెట్టి చూడు అన్నారు. కానీ తర్వాత తమిళనాడు ప్రజలు నన్ను తమ సొంత బిడ్డలా ఆదరించారు’’ అని వనిత పేర్కొంది.