కాంగ్రెస్ లో భారీ ఊపు!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణా కాంగ్రెస్ సీనియర్లపై బాగానే ప్రభావం చూపుతున్నట్లుంది. అందుకనే కొంతకాలంగా గాంధీభవన్ మొహంకూడా చూడని కొందరు సీనియర్లు ఇపుడు రెగ్యులర్ గా కనబడుతున్నారు. మరికొందరు సీనియర్లు తరచూ మీడియా ముందుకొచ్చి గట్టిగా తన వాయిస్ వినిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళంతా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద కోపంలో పార్టీకి దూరంగా ఉంటున్న వాళ్ళే. ఇక మరికొందరు నేతలైతే ఇప్పటికే పాదయాత్ర చేస్తుంటే ఒకళ్ళిద్దరు పాదయాత్రలకు రెడీ అవుతున్నారు.

చాలాకాలంగా పార్టీకి సీనియర్ నేత జానారెడ్డి దూరంగా ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు బదులు కొడుకు పోటీ చేస్తారని గతంలోనే ప్రకటించేశారు. అలాంటి జానారెడ్డి ఇపుడు సడెన్ గా మళ్ళీ కండువా కప్పుకుని గాంధీభవన్లో ప్రత్యక్షమయ్యారు. దీనికి కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం పెరగటమేనట. ఇక మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా చాలాకాలం పార్టీ యాక్టివిటీసలో అంత బిజీగా లేరనే చెప్పాలి. అలాంటిది పొన్నాల కూడా ఇపుడు పార్టీ ఆఫీసులో కనబడుతున్నారు.

ఇక వచ్చేఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేది లేదన్నట్లుగా ఇంతకాలం డైలాగులు చెబుతున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబోయే ఎన్నికల్లో పార్టీ 80 సీట్లతో అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు. తాను జిల్లా అంతా తొందరలోనే పాదయాత్రలు చేయబోతున్నట్లు చెప్పారు. గతంలో కూడా ఇదేమాట చెప్పిన ఎంపీ ఇంతవరకు పాదయాత్ర జోలికే వెళ్ళలేదు. ఇక సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క అయితే కొద్దిరోజులుగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా భట్టీ మధ్యలో బలప్రదర్శనకు కూడా దిగుతున్నారు.

ఇక మరో సీనియర్ జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేస్తానంటు ప్రకటిస్తున్నారు. జగ్గారెడ్డి కూడా పార్టీని వదిలేస్తారని ఆమధ్య ప్రచారం బాగా జరిగింది. అయితే కర్నాటకలో గెలుపుతో అంతా సర్దుకున్నారు. పీసీసీ చీఫ్ అయినదగ్గర నుండి రేవంత్ రెగ్యులర్ గా పాదయాత్రలు, సభలు, సమావేశాలు పెడుతునే ఉన్నారు. రేవంత్ పార్టీ పగ్గాలు తీసుకున్నతర్వాత పార్టీ క్యాడర్లో మంచి స్పీడు వచ్చిందన్నది వాస్తవం. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పటం, సరదాగా మాట్లాడటం, ఆర్ధిక, అంగబలం అపారంగా ఉండటం రేవంత్ కు బలమన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి సీనియర్లంతా ఒక్కసారిగా యాక్టివ్ అవ్వటం పార్టీకి మంచిదే కదా.