విజయ్ చేయాల్సిన సినిమా అతడికి..

ఒక హీరో చేయాల్సిన కథ అది నచ్చకో.. ఇంకో కారణంతోనో మరొకరి చేతికి వెళ్లడం ఫిలిం ఇండస్ట్రీలో సాధారణం. ఇలా చేతులు మారిన కథలు బోలెడు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు సుహృద్భావ వాతావరణంలోనే హీరోల మార్పు జరుగుతూ ఉంటుంది. ‘అన్నీ మంచి శకునములే’ విషయంలోనూ అలాంటి మార్పే జరిగిందని అంటోంది దర్శకురాలు నందిని రెడ్డి. ఈ చిత్రంలో హీరోగా సంతోష్ శోభన్ నటించిన సంగతి తెలిసిందే.

కానీ ఈ కథను తాను విజయ్ దేవరకొండను దృష్టిలో ఉంచుకుని రాసినట్లు నందిని వెల్లడించింది. ఈ కథ రాసి చాలా ఏళ్లయిందని.. అది రాసేటపుడు ముందు విజయే లీడ్‌ రోల్‌కు సరిపోతాడని అనుకున్నట్లు తెలిపింది. విజయ్ కూడా కథ విని సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పింది. ఐతే ఈ కథ పట్టాలెక్కేలోపు విజయ్ పెద్ద రేంజికి వెళ్లిపోయాడని.. సాఫ్ట్‌‌గా సాగే కుటుంబ కథకు అతను సరిపోడని తర్వాత అనిపించి ప్రత్యామ్నాయం ఆలోచించినట్లు నందిని వెల్లడించింది.

చివరికి నిర్మాత స్వప్న దత్.. సంతోష్ అయితే బాగుంటాడని చెప్పగా.. తనకూ అదే అనిపించి స్క్రీన్ టెస్ట్ చేయగా.. అతను తన పాత్రకు పర్ఫెక్ట్‌గా సూటయ్యాడని నందిని తెలిపింది. సంతోష్ అనే కాక ఈ సినిమాలో అన్ని పాత్రలకూ నటీనటులు పర్ఫెక్ట్‌గా అనిపిస్తారని నందిని తెలిపింది. ఇక తన తర్వాతి సినిమా గురించి నందిని వెల్లడిస్తూ.. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో చేయనున్నట్లు చెప్పింది.

‘అలా మొదలైంది’ దగ్గర్నుంచి సిద్ధు తనకు తెలుసని.. మూడు నెలల కిందటే తమ సినిమా ఓకే అయిందని.. తమ ఇద్దరి కాంబినేషన్లో ఒక మ్యాడ్ రోలర్ కాస్టర్ రైడ్ లాగా ఈ సినిమా ఉంటుందని నందిని తెలిపింది. అల్లు అర్జున్‌తో తనకు ఎప్పట్నుంచో స్నేహం ఉందని.. తన ప్రతి కథనూ అతడితో షేర్ చేస్తుంటానని చెప్పిన నందిని.. గతంలో బన్నీతో సినిమా కోసం ప్రయత్నించినా కుదర్లేదని.. ఇప్పుడు అతను పెద్ద స్టార్ కావడంతో తన ఇమేజ్‌కు తగ్గ కథ దొరికినపుడు తమ కలయికలో సినిమా వస్తుందని చెప్పింది.