యూట్యూబ్ చెట్టు కింద ఛత్రపతి జ్ఞానోదయం

ఇటీవలే జరిగిన హిందీ ఛత్రపతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ వాళ్ళబ్బాయి సాయిశ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో అయిదు వందలకు పైగా మిలియన్ల వ్యూస్ తో అదరగొట్టాయని ఈ లెక్కన అతను స్టారని, డెబ్యూతోనే సెన్సేషన్ సృష్టించడం ఖాయమని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. పుత్రోత్సాహంలో ఆలా చెప్పుకోవడం తప్పేమి కాదు. కానీ నిన్న రిలీజైన ఛత్రపతి ఓపెనింగ్స్ చూస్తే మాత్రం వాస్తవాలు ఏంటో తేటతెల్లమవుతాయి. దాదాపు దేశంమొత్తం ఖర్చులన్నీ పోను చాలా నామమాత్రపు షేర్ నమోదు చేసిందనే వార్త షాక్ ఇస్తోంది.

నిజానికి ప్రభాస్ ఛత్రపతినే కోట్లాది ప్రేక్షకులు చూసేశారు. బాహుబలి తర్వాత అతని ఇమేజ్ ప్యాన్ ఇండియా రేంజ్ లో పెరిగిపోయింది. అలాంటప్పుడు ఆల్రెడీ డార్లింగ్ చేసిన కథనే మళ్ళీ తీయాలనుకోవడం అతి పెద్ద సాహసం. ఫ్రీగా దొరికే యూట్యూబ్ లో వ్యూస్ ఎప్పటికీ వసూళ్లుగా మారవు. అక్కడ పైసా ఖర్చు పెట్టే అవసరం ఉండదు కాబట్టి నార్త్ ఆడియన్స్ మన మాస్ మాసాలాను ఎగబడి చూస్తారు. దానర్థం అంతే స్థాయిలో థియేటర్లకు వచ్చి టికెట్లు కొంటారని కాదు. ఆన్ లైన్లో వరల్డ్ రికార్డు సాధించిన జయ జానకి నాయక ఒరిజినల్ గా తెచ్చిన గ్రాస్ ఎంత షేర్ ఎంత

హిట్టు సినిమాలే కాదు తెలుగు డిజాస్టర్లను సైతం యూట్యూబ్ లో విపరీతంగా ఆదరించారు ఉత్తరాది ప్రేక్షకులు. దీన్ని ఇంకోలా అర్థం చేసుకున్న సాయి శ్రీనివాస్ తన విలువైన మూడేళ్ళ కాలాన్ని వృధా చేసుకున్నాడు. ముంబైలోనే ఉంటూ పెట్టుకున్న ఖర్చులు సైతం కిట్టుబాటు కాలేదు. మరోవైపు ముంబై మీడియా ఛత్రపతిని చీల్చి చెండాడేసింది. ఏ ఒక్కరు రెండు పైన రేటింగ్ ఇస్తే ఒట్టు. పైగా ముప్పాతిక గంట ట్రిమ్ చేసి మదర్ సెంటిమెంట్ ని తగ్గించేసి కేవలం హీరో బిల్డప్స్ కే ప్రాధాన్యం ఇవ్వడంతో గట్టిగా ఆడేసుకున్నారు. ఇకనైనా దీన్నో పాఠంగా తీసుకుని కుర్ర హీరోలు యుట్యూబ్ ట్రాప్ లో పడకుంటే చాలు