రంగం జీవాని వారిస్తున్న రజనీ ఫ్యాన్స్

పేరు వినగానే చాలా మంది వెంటనే గుర్తు పట్టకపోవచ్చు కానీ రంగం హీరోగా జీవా మన ఆడియన్స్ కి బాగా గుర్తే. అంచనాలు లేకుండా వచ్చిన సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా అదో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది. ఆ తర్వాత స్నేహితుడు లాంటి డబ్బింగ్ సినిమాలతో కనిపించాడు కానీ పెద్దగా సక్సెస్ పలకరించలేదు. తమిళంలో మాత్రం ఇతనికి ఓ మోస్తరు మార్కెట్ ఉంది. రెగ్యులర్ గా నటిస్తూనే ఉంటాడు. ఇప్పుడితను సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు టార్గెట్ అవుతున్నాడు. అది కూడా ఒక టాలీవుడ్ మూవీ కోసమంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. మ్యాటరేంటో చూద్దాం.

యాత్ర దర్శకుడు మహి రాఘవ్ యాత్ర 2 తీసే ప్లాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీస్తే ఇప్పుడీ సీక్వెల్ ని ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద చేయబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. లేనిపోని వివాదాలు ఇబ్బందులు ఎందుకని మన తెలుగు హీరోలు చేయడం అనుమానమే. అందుకే జీవాని సంప్రదించినట్టు తెలిసింది. ఇంకా అంగీకారం తెలుపలేదు కానీ ప్రాధమికంగా జరిగిన చర్చల్లో ఓకే అనుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనికి రజని అభిమానులకు కనెక్షన్ ఏంటనేగా మీ డౌట్.

ఆ మధ్య ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని పొగిడిన కారణంగా వైసిపి మంత్రులు ఏ రేంజ్ లో రజని మీద మాటల దాడి చేశారో అందరూ చూశారు. ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండింగ్ కూడా చేశారు. అయినా స్పందన రాలేదు. అలాంటిది ఇప్పుడు ఓ కోలీవుడ్ హీరో వైసిపి పార్టీ అధినేతగా నటించడం వాళ్లకు సుతరామూ ఇష్టం లేదు. అందుకే చేయొద్దని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు జీవా ఓకే చెప్పాడో లేదో కానీ జస్ట్ ఒక లీక్ తోనే వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది.