మూడు రోజులకే ఇంత అరాచకమా

బాక్సాఫీస్ వద్ద విరూపాక్ష దూకుడు మాములుగా లేదు. అసలే పోటీ లేని అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటూ మొదటి వీకెండ్ ని గ్రాండ్ గా ముగించింది. తెలుగు రాష్ట్రాల్లో కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ ఫలితంతో పాటు అంతకు ముందు వారం వచ్చిన శాకుంతలం, రుద్రుడు, విడుదల పార్ట్ 1 అన్నీ ఫైనల్ రన్ కు దగ్గరవ్వడంతో సాయి ధరమ్ తేజ్ కి బ్రేకులు లేకుండా పోయాయి. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో ఆ ఆనందం ప్రతి ఒక్కరి మొహంలో స్పష్టంగా కనిపించింది. దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో ఆదివారం మొత్తం హౌస్ ఫుల్స్ పడటమే దీనికి నిదర్శనం

థియేటర్ బిజినెస్ చేసుకున్న టైంలో పాతిక కోట్ల టార్గెట్ ని చేరుకోవడం అసాధ్యమేమో అన్న అనుమానాలు బద్దలు కొడుతూ కేవలం మూడు రోజులకే 20 కోట్ల షేర్ ని దాటేయడం మీడియం రేంజ్ హీరోకి చాలా అరుదు. అందులోనూ తేజు ఫామ్ లో లేడు.

యాక్సిడెంట్ వల్ల వచ్చిన బ్రేక్, రిపబ్లిక్ ఫ్లాప్ మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించాయి. అందుకే ఓపెనింగ్స్ చాలా నెమ్మదిగా మొదలయ్యాయి. కట్ చేస్తే ఫస్ట్ డే సాయంత్రానికి సీన్ మొత్తం మారిపోయింది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 16 కోట్లకు పైగా షేర్ రావడం బ్లాక్ బస్టర్ కు నిదర్శనం. వరల్డ్ వైడ్ గ్రాస్ 37 కోట్ల దాకా వచ్చింది.

ఇవాళ సోమవారం కాబట్టి సహజంగానే డ్రాప్ ఉంటుంది కానీ అది ఎంత శాతం అనేది వేచి చూడాలి. సాధారణంగా వీక్ డేస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కన్నా డైరెక్ట్ కౌంటర్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేవలం ఆన్ లైన్ లో చూసి ఒక అంచనాకు రాలేం. ఒకవేళ ఈ రోజు రేపు కనక స్టడీగా ఉంటే ఇంకో వారం దాకా అడ్డుకట్ట పడకపోవచ్చు. కాకపోతే శుక్రవారం ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 వస్తున్నాయి కాబట్టి స్క్రీన్ కౌంట్ పరంగా విరూపాక్ష మీద గట్టి ప్రభావం పడుతుంది. వాటి టాక్ ని బట్టి మళ్ళీ నిలదొక్కుకోవడమా లేక నెమ్మదించడమా చూడాలి.