సుక్కు శిష్యుడి మీదే అందరి కళ్లూ..

ప్రస్తుతం టాలీవుడ్లో ఒక అగ్ర దర్శకుడి శిష్యుల టాలెంట్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు సుకుమార్. టాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ తర్వాత చాలా పెద్ద సంఖ్యలో తన శిష్యులను ప్రోత్సహించి, వారిని వెనుక ఉండి నడిపిస్తున్న దర్శకుడు సుకుమారే. ఇప్పటికే పల్నాటి సూర్యప్రతాప్, జక్కా హరిప్రసాద్, వేమారెడ్డి, బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల లాంటి వాళ్లు సుక్కు దగ్గర రచయితలుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి.. ఆ తర్వాత దర్శకులుగా మారారు.

వీరిలో వేమారెడ్డి మినహా అందరూ విజయాలు అందుకున్న వాళ్లే. అందులోనూ బుచ్చిబాబు ‘ఉప్పెన’తో, శ్రీకాంత్ ఓదెల ‘దసరా’తో దర్శకులుగా బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడంతో సుక్కు శిష్యుల మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎవరైనా ఆయన దగ్గర శిష్యరికం చేసి దర్శకుడిగా మారుతున్నాడంటే అందరూ ప్రత్యేక ఆసక్తితో చూస్తున్నారు. అలాగే ఇప్పుడు కార్తీక్ దండు మీద అందరి దృష్టీ నిలిచి ఉంది.

ఈ శుక్రవారం రిలీజవుతున్న సాయిధరమ్ తేజ్ మూవీ ‘విరూపాక్ష’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు కార్తీక్ దండు. తాను తీర్చిదిద్దుకున్న కథకు సుకుమార్‌తో స్క్రీన్ ప్లే రాయించుకోవడమే కాదు.. ఆయన నిర్మాణ భాగస్వామిగా ఈ సినిమా చేశాడు కార్తీక్. దీన్ని బట్టే ప్రేక్షకుల కంటే ముందు తన గురువును అతను ఇంప్రెస్ చేశాడని అర్థమవుతుంది. ‘విరూపాక్ష’కు సంబంధించి ప్రతి ప్రోమో కూడా ఆసక్తికరంగా అనిపించింది. ఇదొక పర్ఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ లాగా కనిపిస్తోంది. కొంచెం భిన్నమైన సినిమాలు చూడాలనుకునేవాళ్లు ఈ సినిమా పట్ల బాగానే ఆసక్తి చూపిస్తున్నారు.

ట్రైలర్లతో రేకెత్తించిన ఆసక్తి సినిమాలో కూడా ఉంటుందా.. ప్రేక్షకులను కార్తీక్ ఉత్కంఠతో ఊపేస్తాడా అన్నది చూడాలి. రిలీజ్ ముంగిట బజ్ ఓ మోస్తరుగానే ఉన్నప్పటికీ.. సినిమాకు టాక్ ఉంటే మంచి ఫలితమే అందుకునే ఛాన్సుంది. ఈ సినిమా కూడా బాగా ఆడి మరో సుకుమార్ శిష్యుడు గ్రాండ్ డెబ్యూ ఇచ్చాడంటే.. ఇండస్ట్రీలో నిర్మాతలంతా ఆయన శిష్యుల వెంట పడటం ఖాయం.