దిల్ రాజు లైనప్.. మామూలుగా లేదుగా


టాలీవుడ్లో చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు దిల్ రాజు. ఇటీవలే ఆయన నిర్మాతగా రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ 20 ఏళ్లలో సినిమాల క్వాలిటీ, క్వాంటిటీ, సక్సెస్ రేట్ పరంగా చూస్తే టాలీవుడ్లో నంబర్ వన్ ప్రొడ్యూసర్ రాజే అంటే ఎవరూ ఖండించలేరు. టాలీవుడ్లో మెజారిటీ స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చేశారు.

ఈ మధ్య హిందీ, తమిళంలోనూ సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నారాయన. తెలుగులో కూడా ఆయన సినిమాల స్థాయి పెరుగుతోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలకు తోడు.. కొత్తగా ఆయన ప్లాన్ చేస్తున్న చిత్రాల లిస్టు చూస్తే ఆయన నిర్మాతగా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లైనప్ చూస్తే ఏ నిర్మాతకైనా కళ్లు కుట్టడం ఖాయం.

ఆల్రెడీ రామ్ చరణ్-శంకర్ కలయికలో ‘గేమ్ ఛేంజర్’ లాంటి పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్న రాజు.. ప్రభాస్‌తో భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రాన్ని ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించనున్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలన్న చిరకాల వాంఛను ఆయన నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. చిరును తన బేనర్లో సినిమా చేసేందుకు ఒప్పించిన రాజు.. సరైన దర్శకుడు, కథ కోసం వెతుకుతున్నాడు.

ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తోనూ రాజు ఒక సినిమా చేయబోతున్న విషయం తాజాగా వెల్లడైంది. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ దర్శకుడంటున్నారు. రామ్ చరణ్‌తో ఎవడు, గేమ్ ఛేంజర్ తర్వాత మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు రాజు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడట. ‘ఆర్య’ తర్వాత రాజుతో సుక్కు చేయనున్న సినిమా ఇదే. ఇవి కాక బాలయ్యతో ఒక సినిమా చేయాలని, తారక్-త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా నిర్మించాలని కూడా రాజు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలన్నీ కార్యరూపం దాల్చాయంటే రాజును కొట్టే నిర్మాతే ఉండడు టాలీవుడ్లో.