ఆసుపత్రి బెడ్ మీద హీరోయిన్.. ఏమైంది?


విశాఖ సింగ్ గుర్తుందా? ప్రస్తుతం దర్శకుడిగా మారి తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దె, సర్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి కథానాయకుడిగా నటించిన ‘జ్ఞాపకం’ అనే సినిమాలో ఈ అమ్మాయే కథానాయిక. దాంతో పాటుగా నారా రోహిత్ సినిమా ‘రౌడీ ఫెలో’లోనూ ఆమె హీరోయిన్‌గా చేసింది. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ తెలుగులో చేసిన సినిమాలు అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఆమె కనుమరుగైపోయింది.

ఐతే తమిళంలో మాత్రం విశాఖకు కొన్ని మంచి సినిమాలు పడ్డాయి. అక్కడ ఆమెకు బాగానే పాపులారిటీ ఉంది. కథానాయికగా నటిస్తూనే బిజినెస్‌లోకి కూడా అడుగు పెట్టిన విశాఖ.. ఈ మధ్య తమిళంలో కూడా పెద్దగా సినిమాలు చేయట్లేదు. కొంత కాలంగా లైమ్ లైట్లో లేకుండా పోయిన విశాఖ.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో తన ఫాలోవర్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

ఈ పోస్టులో షేర్ చేసిన ఫొటోలో విశాఖ ఆసుపత్రి బెడ్ మీద పేషెంట్‌గా కనిపించడం గమనార్హం. ఇదేమీ సినిమా కోసం తీసుకున్న స్టిల్ కాదు. రియల్ లైఫ్‌దే. విశాఖ సింగ్‌కు ఏ సమస్య అన్నది వెల్లడించలేదు కానీ.. తాను అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. కొన్ని భయంకరమైన ఘటనలు, ప్రమాదాలు, చలికాలంలో అనారోగ్య సమస్యలు తనను వేధిస్తున్నాయని.. ఐతే తనకు ఎంతో నచ్చే వేసవి సీజన్ రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. ఏప్రిల్ వచ్చిందంటే తనకు కొత్త ఏడాది మొదలైనట్లు అనిపిస్తుందని.. ఈ నెలలోనే తాను పుట్టడం వల్ల కూడా ఈ ఫీలింగ్ కలగొచ్చని చెప్పింది.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నానని విశాఖ పేర్కొంది. విశాఖ మాటల్ని బట్టి చూస్తే ఆమెకు చలికాలం పడదని, ఆ సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అర్థమవుతోంది. విశాఖ పోస్టు చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.