మూడు సినిమాలకు అగ్ని పరీక్షే

ఈ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. శాకుంతలంకు సంబంధించిన ప్రమోషన్లు గట్రా దిల్ రాజు, గుణశేఖర్ బృందం ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే చేసింది. సమంతా దేశమంతా తిరిగి ఏకంగా జ్వరం తెచ్చుకుని విశ్రాంతి తీసుకుంటోంది . ఇంకా ఇరవై నాలుగు గంటల టైం మాత్రమే ఉన్నా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవని బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు. అయితే టీమ్ మాత్రం పాజిటివ్ టాక్ నిలబెడుతుందని ఒకటి రెండు రోజులు స్లోగా ఉన్నా ఆ తర్వాత పికప్ అవుతుందనే నమ్మకంతో ఉంది.

టికెట్ రేట్ల ప్రభావం తెలంగాణలో తీవ్రంగా ఉంది. ఎంత బడ్జెట్ అయినా సరే సమంతా సినిమాకు 295 రూపాయలు పెట్టడం ఆడియన్స్ ని కట్టడి చేస్తోంది. పైగా త్రీడి చార్జీలు దీని మీద అదనం. సోమవారం జరిగిన షో తప్ప మిగిలిన ప్రీమియర్లను రద్దు చేయడం గురించి ఇప్పటికే బోలెడు చర్చ జరుగుతోంది. ఇక లారెన్స్ రుద్రుడు మీద ఎలాంటి బజ్ లేకపోయినా నేరుగా కౌంటర్లలో టికెట్లు కొనే మాస్ ప్రేక్షకుల అండతో గట్టెక్కుతాడనే అంచనాలు బలంగా ఉన్నాయి. ట్రైలర్ చూశాక మరీ ఇంత రొటీనాని పెదవి విరిచిన వాళ్లే ఎక్కువ. సో దీనికీ పబ్లిక్ నుంచి వచ్చే టాకే ముఖ్యం.

వీటి కోసమే ఒక రోజు ఆలస్యంగా శనివారం అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్న విడుదల పార్ట్ 1 మీద కామన్ పబ్లిక్ లో ఎలాంటి ఇంటరెస్ట్ లేదు. తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నా సరే చాలా బోల్డ్ గా వయొలెంట్ గా చూపించే వెట్రిమారన్ శైలి మన జనానికి అంతగా వంటబట్టదు. కానీ గీత ఆర్ట్స్ బృందం మాత్రం కాంతార రేంజ్ లో వండర్స్ జరుగుతాయని ఎదురు చూస్తోంది. మొత్తానికి మూడు సినిమాలకు ఈ రెండు రోజుల్లో అగ్ని పరీక్షే ఎదురు కాబోతోంది. కనీసం వారం రోజులు మంచి వసూళ్లతో బలంగా నిలబడకపోతే బ్రేక్ ఈవెన్ లు కష్టమవుతాయి.