సమంతకు లైన్ క్లియర్

సమంత కెరీర్లో చాలా కీలకమైన సినిమా ‘శాకుంతలం’. ఆమె ఇప్పటికే చెప్పుకోదగ్గ సంఖ్యలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. వాటిలో దాదాపుగా అన్నీ మంచి ఫలితాన్నే అందుకున్నాయి. ఐతే ఈసారి ఆమెను నమ్మి పెద్ద రిస్కే చేశారు గుణశేఖర్, దిల్ రాజు.

ఇండియాలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా మీద ఎవ్వరూ పెట్టనంత ఖర్చు పెట్టి ‘శాకుంతలం’ తీశారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఒక పురాణ గాథను ఇలా పెద్ద బడ్జెట్ పెట్టి తీయడం సాహసమనే చెప్పాలి. ఈ చిత్రం ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. అది అన్ సీజన్ కాబట్టి అప్పుడు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించి వేసవికి వాయిదా వేశారు. ఏప్రిల్ 14న తెలుగులో పాటు పలు భాషల్లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఐతే ఇంత భారీ చిత్రాన్ని బయటపడేసే సత్తా సమంతకు, గుణశేఖర్‌కు ఉందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

ఐతే అంతిమంగా సినిమా ఎలా ఉంటుందన్నదే ప్రధానం అయినప్పటికీ.. ‘శాకుంతలం’కు రిలీజ్ టైమింగ్ మాత్రం బాగానే కుదిరింది. తెలుగు ప్రేక్షకుల్లో ఆల్రెడీ వేసవి మూడ్ వచ్చేసింది. ‘దసరా’కు భారీ వసూళ్లు కట్టబెట్టారు. ఐతే తొలి వీకెండ్ తర్వాత ‘దసరా’ స్లో అయింది. నైజాంలో బాగా ఆడుతున్నప్పటికీ వచ్చే వారానికి సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తవుతుంది. ఈ వారం వస్తున్న రవితేజ సినిమా ‘రావణాసుర’పై ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. ఇది రెండో వారంలో సమంత సినిమాకు ముప్పుగా పరిణమించే అవకాశాలు తక్కువే.

ఇక ఆ వారం ‘శాకుంతలం’కు పోటీగా రానున్న లారెన్స్ సినిమా ‘రుద్రుడు’ ట్రైలర్‌తో తుస్సుమనిపించింది. ఆది సగటు మాస్ మసాలా సినిమాలా ఉంది. తెలుగులో ఒకప్పటితో పోలిస్తే లారెన్స్ క్రేజ్ బాగా తగ్గింది. ‘రుద్రుడు’ వల్ల ‘శాకుంతలం’కు పెద్ద సమస్య అయితే ఉండకపోచ్చు. ఇది కాక తమిళంలో వచ్చే వారం చెప్పుకోద్గ రిలీజ్ లేదు. ఉత్తరాదిన ఏమో కానీ.. దక్షిణాదిన అయితే ‘శాకుంతలం’కు లైన్ క్లియర్ అయినట్లే. మంచి టాక్ వస్తే మంచి వసూళ్లే వస్తాయి ఈ చిత్రానికి.