ఉచిత షోల వివాదంపై దిల్ రాజు సమాధానం

విడుదలైన నెల రోజుల తర్వాత కూడా చర్చల్లో ఉండటం పెద్ద సినిమాల వల్లే కావడం లేదు. అలాంటిది ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని బలగం మూవీ కొత్త కొత్త టాపిక్స్ లో నానుతూనే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా పల్లెటూళ్ళలోని బహిరంగ ప్రదేశాల్లో బలగంని ఉచితంగా ప్రదర్శించడం పెద్ద ట్రెండ్ గా మారిపోయింది. జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు, ఆట పూర్తయ్యాక విడిపోయిన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మరీ కలుసుకుంటున్న ఉదంతాలు సోషల్ మీడియా నిండా కనిపిస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ ఏకంగా వీటి మీద స్పెషల్ స్టోరీలు ఇస్తున్నాయి.

మొన్న ఈ ఉదంతం మీద నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ ఎస్పికి ఫిర్యాదు చేయడంతో ఆయన పట్ల ఓ వర్గంలో నెగటివిటీ వచ్చేసింది. అత్యాశకు పోతున్నారని ఇలా షోలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సరికాదని విమర్శలు చేశారు. వీటికి స్వయంగా దిల్ రాజుగారే వివరణ ఇచ్చారు. బలగం ఎవరు ఎప్పుడు ఎక్కడైనా చూడొచ్చని, ఎవరూ ఆపలేరని, ఇల్లీగల్ గా కొందరు షోలు వేయడం వల్ల అమెజాన్ నుంచి ఒత్తిడి రావడం వల్లే కంప్లయింట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఎవరైనా గ్రామాల్లో చూడాలనుకుంటే మేమే ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఇప్పుడు చూస్తూ ఉండిపోతే భవిష్యత్తులో కొత్త సినిమాలు ఇలా ఓపెన్ ప్లేస్ లో ఫ్రీగా వేయడం వల్ల థియేటర్ల మనుగడకు ఇబ్బందిగా మారుతుందని అందుకే చర్యకు ఉపక్రమించామే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. సో బలగంకి ఇంకాస్త బలం వచ్చినట్టే. నేరుగా ఎస్విసి సంస్థను కలుసుకుంటే షోలకు కావాల్సిన తతంగం వాళ్లే చూసుకుంటారు. ఎలాగూ స్క్రీన్లు స్పీకర్లు సర్పంచులు పెడుతున్నారు కాబట్టి అనుమతులు లైసెన్సులు ప్రింట్లు దిల్ రాజు బృందం ఇచ్చేస్తుంది. తనకు పేరు వస్తే చాలు బ్యాడ్ చేయడానికి ఒక బ్యాచ్ రెడీగా ఉంటుందని రాజుగారు చెప్పడం కొసమెరుపు.