అవతార్ రేంజులో బ్రహ్మాస్త్ర తీస్తారా

విజువల్ ఎఫెక్ట్స్ తో కూడుకున్న భారీ బడ్జెట్ సినిమా తీయడానికి సమయం అవసరమే కానీ మరీ ఏళ్లకేళ్లు ముందే నిర్ణయించుకుని ప్రకటించడం మాత్రం అరుదే. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు ఫలానా టైంకి పూర్తి చేస్తాననే మాటకు వివిధ కారణాల వల్ల కట్టుబడలేకపోయినా ప్రపంచవ్యాప్తంగా వాటికొచ్చిన గుర్తింపు చూసుకుంటే ఆ మాత్రం సమయం అవసరమే అనిపిస్తుంది. ఇప్పుడు బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇదే సూత్రం పాటిస్తానంటున్నాడు. గత ఏడాది రిలీజైన పార్ట్ 1 భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

ఉత్తరాది వైపు బ్రహ్మాండంగా ఆడింది కానీ మన సైడ్ ఆ రేంజ్ స్పందన దక్కని మాట వాస్తవం. జక్కన్న సినిమాలను తలదన్నెల్లా పేరు తెస్తుందని నిర్మాత కరణ్ జోహార్ ఊహించాడు కానీ అది జరగలేదు. తాజాగా బ్రహ్మాస్త్ర రెండు మూడు భాగాలకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్లు ఇచ్చేశారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 డిసెంబర్ 2026 రానుండగా ఒక ఏడాది గ్యాప్ తో చివరి ఘట్టం అదే నెల 2027లో విడుదల కానుంది. వీటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఎవరూ ఊహించని రీతిలో గొప్పగా దీన్ని తీస్తానని అయాన్ ముఖర్జీ హామీ ఇచ్చేశారు. ఒకేసారి వీటిని షూట్ చేయబోతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ అవతార్ రేంజ్ లో రెండు భాగాలకు అయిదేళ్ల గడువు తీసుకోవడం అనూహ్యం. మాములుగా సీక్వెల్స్ కు రెండేళ్లకు మించి క్రేజ్ ఉండదు. బాహుబలి, కెజిఎఫ్, పుష్పలు ఆ సూత్రాన్ని అనుసరించే హైప్ ని నిలబెట్టుకున్నాయి. కానీ బ్రహ్మస్త్ర ఏకంగా మొత్తం అయిదు సంవత్సరాలు తీసుకోవడం విచిత్రం. అవతార్ కోసం జేమ్స్ క్యామరూన్ మాత్రమే ఇలా డేట్లను ఇచ్చారు. బహుశా అయాన్ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడేమో. రన్బీర్ కపూర్ అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో అమితాబ్ తదితరులు కొనసాగబోతున్నారు.