పెద్ద రిస్కుకు సిద్ధపడుతున్న టిల్లు 2

పదేళ్లకు పైగా బ్రేక్ కోసం ఎదురు చూసిన సిద్దు జొన్నలగడ్డకు ఏకంగా బ్లాక్ బస్టర్ అందించిన డీజే టిల్లు మీద యూత్ లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. పెద్దగా బడ్జెట్ పెట్టకుండా సింపుల్ క్రైమ్ ఎలిమెంట్ తో సిద్దు బాడీ లాంగ్వేజ్ ని ఉపయోగించుకుని దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన తీరు భారీ వసూళ్లను కురిపించింది. ప్రస్తుతం దీని సీక్వెల్ టైటిల్ కు స్క్వేర్ జోడించుకుని షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ మంచి స్వింగ్ లో ఉంది. పలువురు హీరోయిన్లు మారాక ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ తో లాక్ చేసుకోవడం తెలిసిందే.

దీని రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత నాగవంశీ ప్రాధమికంగా ఆగస్ట్ 11గా నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిజానికిది మహేష్ బాబు 28 కోసం లాక్ చేసుకున్నది. కానీ ఆ టైంకంతా పూర్తి చేయడం అసాధ్యమని తేలిపోవడంతో సంక్రాంతికి వాయిదా వేశారు. అందుకే దాని స్థానంలో టిల్లు స్క్వేర్ ని దింపాలని చూస్తున్నారట. అయితే అదే రోజు చిరంజీవి భోళా శంకర్ ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉంది. ఇది కాకుండా రన్బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా యానిమల్, సన్నీ డియోల్ గదర్ 2 ఉన్నాయి. రజనీకాంత్ జైలర్ సైతం ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంత పెద్ద వలయం పెట్టుకుని టిల్లు స్క్వేర్ దిగితే రిస్క్ అవుతుంది. గతంలో ఇదే నిర్మాత ఇదే సంస్థ బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీ స్వాతిముత్యంని దసరా పండగ వాడుకునే ఉద్దేశంతో గాడ్ ఫాదర్, ఘోస్ట్ ల మధ్యలో నిలిపారు. ఫలితంగా కంటెంట్ బాగున్నా సినిమా ఆడలేదు. ఇప్పుడు టిల్లు 2కి ఎంత క్రేజ్ ఉన్నా ఈ స్థాయి పోటీని పెట్టుకుని రావడం సాహసమే అవుతుంది. ఒకవేళ ఇది మిస్ చేసుకున్నా తిరిగి దసరాకి ఇంతకన్నా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఏదో ఒకటి ఫేస్ చేయక తప్పదు. ఈ రెండో భాగానికి డైరెక్టర్ మారి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.