ఇది నమ్మే విషయమేనా పుష్పా?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 ది రూల్ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం స్క్రిప్ట్ కోసమే ఏడాదికి పైగా ఖర్చు పెట్టిన సుక్కు సార్ నిర్మాణంలోనూ రాజీ పడటం లేదు. అందుకే ఎంత ఆలస్యమవుతున్నా ఒత్తిడికి తలొగ్గకుండా, ఫలానా సీజన్ కే రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

దానికి తగ్గట్టే బన్నీ పూర్తి సహకారం ఇవ్వడంతో సుకుమార్ మీద ఎలాంటి ప్రెజర్ లేదు. ఏప్రిల్ 8న స్పెషల్ టీజర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పుష్ప డిజిటల్ హక్కులకు గాను మైత్రి అధినేతలు 200 కోట్లు ఆశిస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ చాలా పట్టుదలగా దీన్ని సొంతం చేసుకోవాలని మాట్లాడుతోందని ఇన్ సైడ్ టాక్.

ఒక్క వీరసింహారెడ్డి తప్ప ఇటీవలి ఈ బ్యానర్ సినిమాలన్నీ ఈ ఓటిటికే ఇచ్చారు. వాల్తేరు వీరయ్య, అంటే సుందరానికి, అమిగోస్, హ్యాపీ బర్త్ డే వగైరాలకు భారీ రేట్లిచ్చి కొన్నారు. అయితే పుష్పకు మరీ ఇంత ఫిగర్ అంటే కష్టమని అందుకే ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని వినికిడి. బయటకి కనిపించని మరో వెర్షన్ కూడా ఉంది.

బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ వారం మొత్తం తన గురించి పుష్ప గురించి సోషల్ మీడియాలో హోరెత్తిపోయేలా పిఆర్ టీమ్ ప్రత్యేకంగా ప్లాన్ చేసిందని అందులో భాగంగానే ఈ రెండు వందల కోట్ల టాక్ ని బయటికి వదిలారని అంటున్నారు. ఇందులో నిజమెంతో మైత్రికే ఎరుక. ఎంత క్రేజ్ ఉన్నా ఒక కమర్షియల్ సినిమాకు థియేటర్ రిలీజ్ తర్వాత ఓటిటికి అంత మొత్తం అంటే నమ్మశక్యంగా లేదు. ఒకవేళ జరిగితే మటుకు చరిత్రే అవుతుంది. బాహుబలి, కెజిఎఫ్ తర్వాత సీక్వెల్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుందనే ధీమా ఫ్యాన్స్ లో బాగా కనిపిస్తోంది.