ఆమిర్ అన్నారు.. షారుఖ్ అన్నారు.. చివరికి

బయోపిక్స్ తీయడంలో బాలీవుడ్ ఫిలిం మేకర్ల స్టయిలే వేరు. ఇందులో మంచి నైపుణ్యం సాధించి.. ఎన్నో క్లాసిక్స్ అందించారు. భారీ విజయాలందుకున్నారు. ఈ కోవలోనే చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించడానికి కొన్నేళ్ల ముందే సన్నాహాలు మొదలయ్యాయి. ముందుగా ఈ చిత్రానికి కథానాయకుడిగా వినిపించిన పేరు ఆమిర్‌ ఖాన్‌దే. అతను కూడా సానుకూలంగానే కనిపించాడు. కానీ కారణాలేంటో తెలియదు కానీ అతడి స్థానంలోకి షారుఖ్ వచ్చినట్లు అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని నిర్మించనున్న యూటీవీ పిక్చర్స్ అధినేత సిద్దార్థ్ రాయ్ కపూర్ కూడా గతంలో ఇందులో షారుఖే హీరో అని ధ్రువీకరించాడు. ఈ చిత్రానికి ‘సెల్యూట్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు చెప్పుకున్నారు. ఇది రెండేళ్ల కిందటి మాట.

కానీ తర్వాత రకరకాల మార్పులు జరిగాయి. షారుఖ్ ఈ సినిమా చేయలేనంటూ తప్పుకునేశాడు. తర్వాత రణబీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. అతనూ ఖరారవ్వలేదు. ఆపై విక్కీ కౌశల్ పేరు వినిపించింది. కానీ అతనూ ఓకే చేయలేదు. చివరికిప్పుడు డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్‌తో ఈ సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. ఇంతకుముందు అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’లో ఫర్హాన్ అదరగొట్టాడు. మరోసారి అలాంటి సవాల్ స్వీకరించడానికి ఫర్హాన్ రెడీ అయ్యాడు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, బ్రోకెన్ థ్రెడ్ లాంటి గొప్ప సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మహేష్ మథాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమాలాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది యూటీవీ పిక్చర్స్. వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టబోతున్నారట.