చరణ్ పార్టీని మిస్సయిన ఇద్దరు

నిన్న రాత్రి రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. చిరంజీవి కొత్తింట్లో ప్రత్యేకంగా ఆహ్వనింపపడ్డ అతిథుల మధ్య వేడుకలు మల్టీస్టారర్ రేంజ్ లో జరిగాయి. నాగార్జున, అమల సతీసమేతంగా విచ్చేయడం ఈ జంటతో పాటు అఖిల్, నాగచైతన్య కలిసి రావడం అక్కినేని ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీ వెంకటేష్, రానాలు తమ వంతు ఆకర్షణను జోడించారు. కాజల్ అగర్వాల్ కపుల్, ఇటీవలే పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ జోడితో పాటు లక్ష్మి ప్రసన్న కూడా ఇందులో భాగమయ్యారు. ప్రముఖ దర్శక నిర్మాతలందరూ కనిపించారు.

రాజమౌళి కుటుంబం వచ్చింది. ఎస్ఎస్ కార్తికేయ, కాలభైరవలతో పాటు ఎంఎం కీరవాణి శ్రీమతితో కలిసి వచ్చారు. ఆస్కార్ గెలిచిన సందర్భంగా ఈ బృందాన్ని చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. అడవి శేష్, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, డివివి దానయ్య, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగుంజ్, ప్రశాంత్ నీల్, నర్తన్, బి గోపాల్, కెఎస్ రామారావు, అశ్వినీదత్, కోదండరామిరెడ్డి, మైత్రి నవీన్-రవి, బివిఎస్ఎన్ ప్రసాద్, దిల్ రాజు, ఎన్వి ప్రసాద్ ఇలా లిస్టు చాలా పెద్దదే ఉంది. డిన్నర్ కూడా అక్కడే ఏర్పాట్లు చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఒక్క లోటు మాత్రం కనిపించింది.

కొరటాల శివ సినిమాలో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ కారణంగా నిన్న కనిపించలేదు. గత ఏడాది ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ పోస్ట్ రిలీజ్ మూడ్ లో ఉండటం వల్ల సులభంగా కలుసుకున్నారు. కానీ ఈసారి ఆ కలయిక కుదరలేదు. అల్లు అర్జున్ వస్తాడేమో అనుకుంటే అరవింద్ మాత్రమే దర్శనమిచ్చారు. బన్నీది కూడా తారక్ లాంటి రీజనే. పుష్ప 2 ప్రెజర్ మాములుగా లేదు. కానీ సుకుమార్ వచ్చినప్పుడు బన్నీ ఫ్రీనే కదానే లాజిక్ కి సమాధానం లేదు. అయితే కనీసం ఒక్క ట్వీట్ చేయకపోవడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది. మొత్తానికి తారక్ బన్నీలు లేకపోవడం వాళ్ళ అభిమానులు వెలితిగానే ఫీలయ్యారు