ప్రభాస్.. మహేష్.. ఇంకా ఎవరు?

వరుసగా రెండేళ్లు కరోనా కారణంగా కళ తప్పిన సంక్రాంతి సీజన్లో.. ఈ ఏడాది మాత్రం బాగానే సందడి కనిపించింది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు బాక్సాఫీస్‌ను కళకళలాడించాయి. వచ్చే ఏడాది ఈ సీజన్లో ఇంతకుమించిన సందడి చూడబోతున్నామని స్పష్టంగా తెలిసిపోతోంది. ఆల్రెడీ ప్రభాస్ సినిమా ‘ప్రాజెక్ట్-కే’ను 2024 సంక్రాంతికి షెడ్యూల్ చేశారు. అది పాన్ వరల్డ్ రేంజ్ మూవీ. దీంతో పాటు ఇప్పుడు మహేష్ బాబు కొత్త సినిమాను కూడా వచ్చే సంక్రాంతికే ఫిక్స్ చేశారు.

ప్రభాస్, మహేష్ లాంటి టాప్ స్టార్ల సినిమాలు సంక్రాంతి రేసులో ఉంటే.. బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో సందడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఐతే ఇంతటితో బెర్తులు ఫుల్ అయిపోయినట్లు ఫిక్స్ అయిపోవచ్చా.. లేదా ఇంకా ఎవరైనా టాప్ హీరోలు బరిలో నిలుస్తారా అన్నది ఆసక్తికరం. ఎన్టీఆర్ కొత్త సినిమా వచ్చే వేసవికి షెడ్యూల్ అయింది.

అల్లు అర్జున్ పుష్ప-2ను ముందు సంక్రాంతికే అన్నారు కానీ.. అప్పటికి సినిమబా రెడీ అయ్యే అవకాశం లేనట్లే. అది కూడా వేసవికే రావచ్చు. ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది రామ్ చరణ్-శంకర్‌ల సినిమానే. తాజాగా ఈ సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. కానీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఈ సినిమా కూడా సంక్రాంతికే అన్న ప్రచారం ఉంది. కానీ గ్యారెంటీ అని చెప్పలేం.

ఆల్రెడీ రెండు భారీ చిత్రాలు సంక్రాంతికి షెడ్యూల్ అయి ఉండగా.. దీన్ని కూడా అదే సీజన్‌కు తీసుకురావాలంటే కష్టమే. సరిపడా థియేటర్లు దొరకవు. పోటీ వల్ల వసూళ్లు దెబ్బ తింటాయి. పంతానికి పోయి సంక్రాంతికి రావడం కంటే వేసవికి వాయిదా వేసుకోవడం మంచిదనే అభిప్రాయాలున్నాయి. కాకపోతే ‘ప్రాజెక్ట్-కే’ పక్కాగా వచ్చే సంక్రాంతికి వస్తుందన్న గ్యారెంటీ లేదు. మధ్యలో ఈ సినిమా వాయిదా పడుతుందన్న సంకేతాలు అందితే ఆ స్థానంలో ‘గేమ్ ఛేంజర్’ వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే దాన్ని వేసవికే ఫిక్సయిపోవచ్చు.