ఈ సినిమా కూడా సంక్రాంతికే.. హోప్‌ఫులీ

తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు అతి పెద్ద సీజన్ అంటే.. సంక్రాంతే. ఆ పండక్కి ప్రతిసారీ మూడు నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజవుతాయి. అందులో కనీసం రెండయినా భారీ చిత్రాలుంటాయి. 2021 సంక్రాంతికి కూడా ఇలాంటి భారీతనంతో బాక్సాఫీస్ బద్దలవుతుందనే అంతా అనుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ను ఆ పండక్కే షెడ్యూల్ చేశారు. దీంతో పాటు మరో పెద్ద సినిమా రావచ్చన్నారు. కానీ కరోనా పుణ్యమా అని లెక్కలన్నీ మారిపోయాయి. ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది. ఆచార్య, వకీల్ సాబ్ లాంటి సినిమాలు సంక్రాంతి రేసులోకి వస్తాయన్నారు కానీ.. అలాంటి సూచనలు ప్రస్తుతానికైతే లేదు. ‘ఆచార్య’ చాలా వరకు సందేహమే కానీ.. పరిస్థితులు బాగుపడితే ‘వకీల్ సాబ్’ వస్తుందేమో చూడాలి.

ఐతే ఈ మధ్య ఓ మీడియం రేంజ్ సినిమా సంక్రాంతి రిలీజ్ ముచ్చట చెప్పింది. అదే.. రంగ్‌ ‌దే. నితిన్ హీరోగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న చిత్రమిది. ఇటీవలే నితిన్ పెళ్లి కానుకగా దీని టీజర్ రిలీజ్ చేశారు. చివర్లో సంక్రాంతి రిలీజ్.. హోప్ ఫులీ అని వేశారు.

ఇదే తరహాలో సంక్రాంతి రిలీజ్‌పై ఆశతో మరో సినిమా ఉన్నట్లు సమాచారం. అదే.. మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచిలర్. దీన్ని మే 1నే రిలీజ్ చేయాలనుకున్నారు. దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. లాక్ డౌన్ టైంలో కొంత మేర పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేశారు. పరిస్థితులు చక్కబడి రెండు మూడు వారాల టైం దొరికితే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది.

అఖిల్ కెరీర్‌కు ఈ సినిమా కీలకం కావడంతో మంచి సీజన్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దసరా మీద పెద్దగా ఆశల్లేని నేపథ్యంలో పెద్ద సినిమాల పోటీ లేకుంటే సంక్రాంతికి ‘ మోస్ట్ ఎలిజుబుల్ బ్యాచిలర్’ను రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.