భీష్మ దర్శకుడి నిరీక్షణకు బ్రేక్ పడినట్టే

గత ఏడాది మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకుని ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ నిర్మించిన దానయ్య ప్రొడ్యూసర్ గా ప్రాజెక్టు లాక్ చేసుకున్న దర్శకుడు వెంకీ కుడుములకు ఆ ఆనందం ఎక్కువసేపు మిగల్లేదు. ఫైనల్ నెరేషన్ తో మెప్పించలేకపోయాడో లేక గాడ్ ఫాదర్ యావరేజ్, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ ఫలితాలు చూశాక చిరు మనసు మారిందో ఏమో కానీ మొత్తానికి సినిమా క్యాన్సిలైపోయింది. భీష్మలాంటి పెద్ద హిట్టు సాధించాక కూడా ఈ పరిస్థితి రావడం అనూహ్యం. దీంతో వెంకీకు గ్యాప్ వచ్చేసింది.

ముచ్చటగా రెండో సారి మళ్ళీ నితిన్ తోనే జట్టుకట్టబోతున్నాడు కుడుముల. అయితే ఈసారి ప్రొడక్షన్ హౌస్ మారింది. మైత్రి మూవీ మేకర్స్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. బడ్జెట్ కూడా భారీగా పెట్టబోతున్నారని ఇన్ సైడ్ టాక్. కామెడీ మిక్స్ చేసిన ఎంటర్ టైనర్స్ ని హ్యాండిల్ చేయడంలో తన ప్రావీణ్యం చూపించిన వెంకీ ఈసారి యాక్షన్ జోలికి వెళ్తాడట. నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పుష్ప, దసరా స్టైల్ లో ఊర మాస్ బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందుతోందని ఆల్రెడీ టాక్ ఉంది. ఇది పూర్తవ్వడానికి కొంత టైం పట్టేలా ఉంది.

కారణాలు ఏవైనా యూత్ టాలెంటెడ్ డైరెక్టర్లకు ఇలా ఇంతేసి గ్యాప్ రావడం వల్ల వాళ్ళ విలువైన కాలం వృధా అవుతోంది. పోనీ ఫ్లాపులు ఉంటే ఏదో అనుకోవచ్చు. సక్సెస్ ట్రాక్ మీద ఉండి కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఎంతైనా ఇబ్బందే. అయినా వరస హిట్ల మీదున్న దర్శకుడి స్టోరీ లైన్ ఓకే కాకపోవడం చూస్తుంటే చిరు కథల ఎంపిక విషయంలో మరీ ఎక్కువ జాగ్రత్తతో ఉంటున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఇది క్యాన్సిల్ కాకపోయి ఉంటే భోళా శంకర్ తర్వాత వెంటనే వెంకీ కుడుములది పట్టాలెక్కేది. కానీ ఎక్కడో లెక్క తప్పి ఫైనల్ గా పక్కకెళ్లింది