ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్‌తో ‘సాహో’ డైరెక్టర్?

‘రన్ రాజా రన్’ సినిమాతో వావ్ అనిపించాడు యువ దర్శకుడు సుజీత్. కేవలం షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో.. ఏ దర్శకుడి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయకుండానే.. 24 ఏళ్ల వయసులోనే తొలి సినిమాను డైరెక్ట్ చేయడమే కాక.. దాన్ని పెద్ద హిట్ చేసి ఆశ్చర్యపరిచాడు.
ఇందుకు పెద్ద ప్రతిఫలమే దక్కింది.

‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ మెగా ప్రాజెక్టును డీల్ చేయడంలో అతను తడబడ్డాడు. దీంతో కెరీర్ తిరగబడింది. మెగాస్టార్ చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారింది.

దీంతో జంక్షన్లో వచ్చి నిలబడ్డాడు. ఐతే ఇబ్బందుల్లో ఉన్న అతణ్ని ప్రభాసే ఆదుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్‌లోనే అతను తన తర్వాతి చిత్రాన్ని చేయబోతున్నాడన్నది తాజా సమాచారం.

ప్రభాస్‌కు ఇండస్ట్రీలో అత్యంత ఆప్త మిత్రుల్లో ఒకడైన గోపీచంద్.. సుజీత్ కొత్త సినిమాలో హీరోగా నటించనున్నాడట. ఇందులో మరో హీరో కూడా నటిస్తాడని అంటున్నారు కానీ.. అదెంత వరకు నిజమో తెలియదు. గోపీచంద్ అయితే ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. గోపీ ఇంతకుముందు యువి బేనర్లోనే ‘జిల్’ అనే సినిమా చేశాడు. దానికి మంచి రివ్యూలు వచ్చినా.. అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఓవర్ బడ్జెట్ సమస్య అయింది. దాని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రస్తుతం యువి బేనర్లోనే ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా సుజీత్ దెబ్బ తిన్నాడు. గోపీ మార్కెట్ కూడా పడిపోయింది.

ఈ నేపథ్యంలో పరిమిత బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం గోపీ ‘సీటీమార్’ చేస్తున్నాడు. తేజ దర్శకత్వంలో ‘అలివేలు మంగ’లోనూ నటించాల్సి ఉంది.