నన్ను తొక్కేస్తున్నారు-పూనమ్ కౌర్


పేరుకు ఉత్తరాది అమ్మాయే కానీ.. చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటోంది పూనమ్ కౌర్. చేసిన సినిమాలు తక్కువ.. అవి కూడా పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు కానీ.. వ్యక్తిగత విషయాలతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్‌తో తన పేరు ముడిపడడం వల్లే పూనమ్‌కు ఎక్కువ పాపులారిటీ వచ్చిందనడంలో దాచిపెట్టేదేమీ లేదు.

ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు, వివాదాలు ఉన్నాయి. ఈ మధ్య రాహుల్ గాంధీ లాంటి రాజకీయ నాయకులతో కలిసి కనిపించడం వల్ల పూనమ్ హైలైట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తాను తెలంగాణ అమ్మాయినే అని పేర్కొంటూ.. కానీ తనను తెలుగు సినీ పరిశ్రమలో ఎదగకుండా తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించడం విశేషం.

“నేను ఒక పంజాబీని కావడం.. సిక్కు మతం నుంచి రావడం వల్ల మీడియా వాళ్లు ఎప్పుడూ పంజాబీ పిల్ల అంటూ ఉంటారు. కానీ నేనేమంటానంటే.. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. కల్చర్ ఇక్కడే. నన్ను ఎందుకు అందరూ సెపరేట్‌గా చూస్తారు. పంజాబీ పంజాబీ అని ఎందుకు అంటారు? నాకు ఇండస్ట్రీలో పని చేయాలని ఉంది. కానీ మీకు ఇష్టమైన అమ్మాయిలే పని చేయాలా? బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలే పని చేయాలా? తెలుగు అమ్మాయి.. తెలుగుబిడ్డ.. సావిత్రి అమ్మ అని చెప్తారు. కానీ ఇక్కడున్న బిడ్డల్ని ప్రోత్సహించరు? అది అసమంజసం కాదా? రాజకీయ స్వార్థం వల్ల చాలామంది అమ్మాయిలను తొక్కేస్తున్నారు.. అందులో నేను కూడా ఒకదాన్ని” అంటూ తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై, నటి ఖుష్బూ తదితరులు పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పూనమ్ కౌర్ పేర్కొంది.