కన్నడ దర్శకుడితో గోపీచంద్

సినిమాల నాణ్యత, వైవిధ్యం, మార్కెట్ పరంగా చూస్తే దక్షిణాదిన మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే వెనుకబడి ఉండేది కన్నడ సినీ పరిశ్రమ. కానీ గత కొన్నేళ్లలో శాండిల్‌వుడ్ పట్ల జనాల దృక్కోణమే మారిపోయింది. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి, అనూప్ భండారి, రాజ్ బి.శెట్టి లాంటి దర్శకులు కన్నడ సినిమా ప్రమాణాలను ఎంతో పెంచారు.

రంగితరంగ, కేజీఎఫ్, గరుడ గమన వృషభ వాహన, కాంతార లాంటి సినిమాలు కన్నడ పరిశ్రమ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశాయి. ఈ క్రమంలోనే కన్నడ దర్శకులతో సినిమాలు చేయడానికి వేరే ఇండస్ట్రీలు హీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ‘సలార్’ తీస్తున్నాడు. శాండిల్‌వుడ్‌కే చెందిన నర్తన్‌తో పని చేయడానికి రామ్ చరణ్ లాంటి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈలోపు శాండిల్‌వుడ్ నుంచి మరో దర్శకుడు టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. అతనే.. హర్ష.

గోపీచంద్ హీరోగా హర్ష దర్శకత్వంలో తెలుగులో ఓ సినిమా మొదలవుతోంది. ఇంతకుముందు గోపీచంద్‌తోనే ‘పంతం’ సినిమాను నిర్మించిన కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. ప్రస్తుతం గోపీ.. తనకు లక్ష్యం, లౌక్యం లాంటి హిట్లు ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ‘రామబాణం’ చేస్తున్నాడు. అది దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇప్పుడు హర్ష సినిమాను మొదలుపెడుతున్నాడు. తన 25వ సినిమా అయిన ‘పంతం’ను మంచి బడ్జెట్లో రాజీ లేకుండా నిర్మించిన రాధామోహన్‌కు హిట్ ఇవ్వలేకపోయాడు గోపీ. అప్పుడే ఆయనతో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడది నెరవేరుస్తున్నాడు.

కన్నడలో హర్ష.. పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేశాడు. శివరాజ్ కుమార్‌తో అతను చేసిన ‘భజరంగి’, ‘వజ్రకాయ’ పెద్ద హిట్లే అయ్యాయి. పునీత్ రాజ్‌కుమార్‌తోనూ ‘అంజనీ పుత్ర’ అనే కమర్షియల్ మూవీ చేసి హిట్టు కొట్టాడు. తాజాగా శివరాజ్‌తో అతను తీసిన ‘వేద’ కూడా కన్నడలో పెద్ద హిట్టయింది. మరి తెలుగులో గోపీకి అతను ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి.