విజ‌య్ సినిమాకు 400 కోట్లా?

త‌మిళంలో ఇప్పుడు విజ‌య్ నంబ‌ర్ వ‌న్ హీరో అనే విష‌యంలో మ‌రో మాట లేదు. గ‌త ద‌శాబ్ద కాలంలో అత‌ను ఇంతింతై అన్న‌ట్లుగా ఎదిగిపోయాడు. అత‌డి సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా భారీ వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. ర‌జినీకాంత్ డౌన్ అవుతున్న టైంలోనే విజ‌య్ నిల‌క‌డ‌గా స‌క్సెస్‌లు అందుకుంటూ ఎవ్వ‌రూ అందుకోలేని రేంజికి వెళ్లిపోయాడు.

ఐతే అత‌డి సినిమాల విష‌యంలో బిజినెస్, క‌లెక్ష‌న్ల‌ నంబ‌ర్లు మ‌రీ ఎక్కువ చేసి చూపిస్తుంటారనే విమ‌ర్శ కూడా ఉంది. ఈ సంక్రాంతికి డివైడ్ టాక్‌తో మొద‌లైన వారిసు సినిమా ఉన్నంత‌లో మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది కానీ.. దాని థియేట్రిక‌ల్ రెవెన్యూ ఏకంగా రూ.300 కోట్లు దాటిపోయిన‌ట్లుగా పోస్ట‌ర్లు దించ‌డంపై సోష‌ల్ మీడియాలో చాలా ట్రోలింగ్ న‌డిచింది. ఆ సినిమా సంగ‌త‌టుంచితే.. ఇటీవ‌లే మొద‌లైన విజ‌య్ కొత్త సినిమా బిజినెస్ గురించి వ‌స్తున్న వార్త‌లు షాక్‌కు గురి చేస్తున్నాయి.

మాస్ట‌ర్ త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టిస్తున్న కొత్త సినిమాకు లియో అనే టైటిల్ ఖ‌రార‌వ‌డం.. ఇటీవ‌లే దీని షూటింగ్ మొద‌లు కావ‌డం తెలిసిందే. ఈ సినిమాకు ఏకంగా రూ.400 కోట్ల బిజినెస్ జ‌రిగిపోతున్న‌ట్లు త‌మిళ మీడియా జ‌నాలు, ట్రేడ్ పండిట్లు ఊద‌ర‌గొట్టేస్తున్నారు. ఐతే షూటింగ్ కూడా ఆరంభ ద‌శ‌లో ఉండ‌గా అప్పుడే పూర్తి బిజినెస్ లెక్క‌ల గురించి మాట్లాడ‌డం.. ఏకంగా లెక్క‌ 400 కోట్లు దాటిపోవ‌డం విడ్డూరంగా ఉంది.

విజ‌య్‌కి ఈ మ‌ధ్య తెలుగులో, ఉత్త‌రాదిన కొంచెం మార్కెట్ ఏర్ప‌డి ఉండొచ్చు. త‌మిళంలో కూడా మార్కెట్ పెరిగి ఉండొచ్చు. కానీ అత‌నేమీ పాన్ ఇండియా స్టార్ అయితే కాదు. త‌మిళ సినిమాల మార్కెట్ ప‌రిధి ప్ర‌కారం చూస్తే అత‌డి సినిమాల‌కు రూ.400 కోట్ల బిజినెస్ జ‌రగ‌డం అన్న‌ది ఏమాత్రం న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌డం లేదు. వారిసు 300 కోట్లు క‌లెక్ట్ చేసిన‌ట్లుగా దించిన పోస్ట‌ర్ వ్య‌వ‌హారం లాగే ఉంది ఇది కూడా.