నాగ్ కోసం ఇంకో ‘మనం’

అక్కినేని నాగార్జున కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని చిత్రాల్లో ఒకటి ‘మనం’. కేవలం నాగ్ అనే కాదు.. అక్కినేని కుటుంబానికి.. అభిమానులకు ఒక చిరస్మరణీయ చిత్రంగా మిగిలిపోయింది ‘మనం’. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఇదే చివరి చిత్రం కావడం.. నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా ఇందులో నటించడం ‘మనం’కు ప్రత్యేకత తీసుకొచ్చింది.

ఇలాంటి సినిమా మనకూ ఒకటుంటే బాగుంటుందని టాలీవుడ్లో బడా ఫ్యామిలీలన్నీ ఫీలై ఉంటాయనడంలో సందేహం లేదు. ‘మనం’ తర్వాత మళ్లీ అలాంటి సినిమాను నాగ్ అభిమానులకు ఇవ్వలేకపోయాడు. ఆ స్థాయి సినిమా సంగతి తర్వాత.. ముందు ఆయనకో హిట్ పడితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ బెజవాడ అయినా ఆ లోటు తీరుస్తాడేమో చూడాలి.

ఐతే ప్రసన్నకుమార్ సినిమా తర్వాత నాగ్ చేయబోయే చిత్రం మీద ఇప్పుడు ఫ్యాన్స్‌లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అది నాగార్జునకు వందో చిత్రం. ఈ మైల్ స్టోన్ ప్రాజెక్టును ఆల్రెడీ తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా చేతిలో పెట్టేశాడు నాగ్. ‘గాడ్ ఫాదర్’తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి మంచి ఫలితాన్నే అందుకున్న మోహన్.. ప్రస్తుతం నాగ్ వందో సినిమా మీదే పని చేస్తున్నాడు.

నాగ్‌కే కాక, అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా ప్రతిష్టాత్మకం కావడంతో దాన్ని మరో ‘మనం’లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడట. దీన్నొక మల్టీస్టారర్ లాగే తీర్చిదిద్దనున్నాడట. అఖిల్ ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తాడట. ‘మనం’లో అఖిల్ చేసినట్లు చైతూ ఇందులో క్యామియో రోల్ చేస్తాడట. ఐతే ‘మనం’ తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రం కాదట ఈ చిత్రం. యాక్షన్ ఎంటర్టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దనున్నాడట మోహన్. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.