హాట్ టాపిక్‌గా మారిన ఆలియా పోస్టు

ఈ సోషల్ మీడియా కాలంలో.. ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ రోజుల్లో.. సెలబ్రెటీల ప్రైవసీ అనేది పెద్ద సమస్యగా మారిపోతోంది. వాళ్లు ఇంటి నుంచి బయట అడుగు పెట్టడం ఆలస్యం.. కెమెరాలు వెంటాడేస్తుంటాయి. వాళ్లు ఏ స్థితిలో ఉన్నారు.. ఏ పనిలో ఉన్నారు అని చూడకుండా కెమెరాలు క్లిక్‌మనిపించేస్తుంటారు జనాలు. ఐతే బయటికి వచ్చినపుడు ఈ సమస్య ఎప్పుడూ ఉండేదే కానీ.. కనీసం ఇంట్లో ఉన్నపుడు కూడా వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకపోవడం దారుణమైన విషయం.

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సమస్యతోనే ఇబ్బంది పడింది. తాను ఇంట్లో ఉండగా దగ్గర్లో ఉన్న ఒక ఇంటి డాబా నుంచి ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీయడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు హాట్ టాపిక్‌గా మారింది.

‘‘మీరు నాతో ఆడుకుంటున్నారా? నేను ప్రశాంతంగా నా ఇంట్లో కుటుంబంతో గడుపుతున్నాను. ఎవరో నాపై నిఘా పెట్టినట్లు అనిపించింది. పక్కకు చూస్తే ఇద్దరు వ్యక్తులు మా పక్కింటి డాబా మీది నుంచి నన్ను కెమెరాతో వీడియో తీస్తున్నారు. ఇది సరైందేనా? ఒకరి ప్రైవసీని గౌరవించరా? ఎలాంటి వాళ్ల మధ్య అయినా దాటకూడని ఒక గీత ఉంటుంది. మీరు హద్దులు దాటి ప్రవర్తించారు’’ అంటూ సదరు వ్యక్తుల మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబయి పోలీసులను ఈ పోస్టులో ఆమె ట్యాగ్ చేసింది. జాన్వి కపూర్ పలువురు సెలబ్రెటీలు ఈ పోస్టు మీద స్పందించారు.

సెలబ్రెటీల వ్యక్తిగత స్వేచ్ఛను జనాలు ఏమాత్రం గౌరవించడం లేదని.. మరీ హద్దులు దాటిపోతున్నారని.. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాలని.. ఆలియాను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా ఆలియాకు మద్దతుగా నిలుస్తున్నారు.