అవార్డులపై కన్నేసిన దిల్ రాజు

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఎన్ని సినిమాలొచ్చినా అందులో ‘శతమానం భవతి’ కి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. కమర్షియల్ గా ఎన్ని విజయాలు అందుకున్నా , ఎంత మంచి పేరు తెచ్చుకున్నా దిల్ రాజు కి నేషనల్ అవార్డు తో గౌరవం తీసుకొచ్చింది మాత్రం ‘శతమానం భవతినే’. అందుకే బొమ్మరిల్లు తర్వాత రాజు గారు తనకి స్పెషల్ మూవీగా ఈ సినిమానే చెప్పుకుంటారు.

ఇప్పుడు మరో అవార్డు ఫిలిమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దిల్ రాజు. కమెడియన్ వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘బలగం’ అనే చిన్న సినిమా నిర్మించాడు. ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ లోగా కొందరికి స్పెషల్ షోస్ వేస్తూ వారి చేత మెప్పు పొందే ప్రయత్నంలో ఉన్నారు.

తెలంగాణా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ తనకి నేషనల్ అవార్డు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నాడు దిల్ రాజు. పదే పదే అందరితో అదే చెప్పుకుంటున్నారు కూడా. ఒక ముసలి వ్యక్తి మరణం తర్వాత జరిగే డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ లో వచ్చిన ‘తిథి’ కి కాస్త దగ్గరగా ఉండబోతుందని అంటున్నారు. తిథి కి బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ కన్నడ కేటగిరీలో నేషనల్ అవార్డు దక్కింది. ఇప్పుడు అదే కోవలోకి చెందిన ‘బలగం’ కి కూడా అవార్డు వస్తుందని భావిస్తున్నాడు దిల్ రాజు. ఒక్క నేషనల్ అవార్డు మాత్రమే కాకుండా బలగం తన బేనర్ కి మరిన్ని అవార్డులు తెచ్చిపెడుతుందని చాలా నమ్మకంతో ఉన్నారు. మరి బలగం దిల్ రాజు నమ్మకాన్ని నిలబెడుతుందా ? చూడాలి.