సాయిపల్లవి గ్యాప్ ఎందుకు తీసుకుంటోంది

ఇప్పుడున్న హీరోయిన్లలో కేవలం పెర్ఫార్మన్స్ ఇచ్చే అవకాశమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్న సాయిపల్లవి ఇప్పటిదాకా కొత్త తెలుగు సినిమాలేవీ సైన్ చేయలేదు. అలా అని నిర్మాతలు దర్శకులు సంప్రదించడం లేదని కాదు. కొందరు కలుస్తున్నారు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వింటున్న కథలేవీ కేరళ కుట్టికి నచ్చడం లేదట. ఎంతో నమ్మకం పెట్టుకున్న విరాట పర్వం బాక్సాఫీస్ ఫలితం తీవ్రంగా నిరాశపరచడంతో పాటు దాని నిర్మాణంలో జరిగిన ఆలస్యం తనను బాగా ఇబ్బంది పెట్టిందని ఆ కారణంగానే కొంత గ్యాప్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందట.

దీని కన్నా ముందు చేసిన శ్యామ్ సింగ రాయ్, లవ్ స్టోరీల సక్సెస్ లలో సాయిపల్లవి పాత్ర ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప 2లో మరో కథానాయిక కోసం దర్శకుడు సుకుమార్ తననే సంప్రదించాడనే టాక్ వచ్చింది కానీ అది సైతం కేవలం వార్తకే పరిమితమయ్యింది. గార్గి ఎంత పేరు తెచ్చుకున్నా కమర్షియల్ లెక్కల్లో అది కూడా ఫెయిల్యూర్ గానే పరిగణించాలి. నటిగా ఎంత సంతృప్తి కలుగుతున్నా మార్కెట్ కోణంలో తన విలువ ఇంకా పెద్ద స్థాయికి వెళ్లడం లేదనే ఆలోచనతో ఇకపై ముందు మలయాళం చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుందని వినికిడి

ప్రస్తుతం తన చేతిలో శివ కార్తికేయన్ తో చేస్తున్న తమిళ సినిమా ఒకటే ఉంది. కెరీర్ ని మలుపు తిప్పిన ప్రేమమ్ హీరో నివిన్ పౌలీతో మరోసారి జట్టు కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న న్యూస్ మల్లువుడ్ మీడియాలో వచ్చేసింది. అయితే తెలుగు ఫ్యాన్స్ కి మాత్రం ఇప్పుడప్పుడే గుడ్ న్యూస్ చెప్పేలా లేదు. మీడియం రేంజ్ హీరోలతో సమానంగా థియేటర్ల దగ్గర కటవుట్లు పెట్టే ఫాలోయింగ్ ఏపీ తెలంగాణలో సాయిపల్లవికి ఉంది. అంత డిమాండ్ ఉన్నప్పుడు ఏడాదికి కనీసం ఒకటో రెండో చేయాలి కానీ ఇలా గ్యాప్ ఇచ్చేస్తే ఎలా అన్న అభిమానుల ప్రశ్నకు సమాధానం అంత సులువుగా దొరక్కపోవచ్చు