కొండారెడ్డి బురుజు సాక్షిగా RC లీక్స్

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా రిలీజుల్లో ఒకటైన ఆర్సి 15 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ చార్మినార్ నుంచి కర్నూలు కొండారెడ్డి బురుజుకి షిఫ్ట్ అయ్యింది. భారీ జనసందోహం మధ్య ఉదయం అయిదు గంటల నుంచే షూటింగ్ చేస్తున్నారు. తెల్లవారుఝామున కాబట్టి ట్రాఫిక్ పెద్దగా ఉండదనే అంచనాలు తలకిందులు చేస్తూ పబ్లిక్ విపరీతంగా గుమికూడారు. పరిస్థితి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసే దాకా వచ్చింది. చిత్రీకరిస్తున్న సన్నివేశం శ్రీకాంత్ రాజకీయ పార్టీ ప్రచారానికి కావడంతో దానికి అవసరమైన క్రౌడ్ కంటే ఎక్కువ అక్కడ పోగయ్యింది.

ఈ సినిమాను ముందు నుంచి లీకులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు షూట్ తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థ తరఫున ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఇన్స్ టాలో వీటిని డిలీట్ చేయిస్తున్నా పదే పదే కొత్త రూపాల్లో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. అభ్యుదయం పార్టీ తరఫున శ్రీకాంత్ రామ్ చరణ్ తదితరులు పాల్గొన్న సీన్లు పరస్పరం బురుజు ఎత్తు పైనుంచి కౌగిలించుకునే విజువల్స్ అన్నీ ఫ్యాన్స్ కెమెరాలో బందించేశారు. పబ్లిక్ ముందు కాబట్టి ఎంత ప్రయత్నించినా వీటిని కట్టడి చేయడం అసాధ్యం.

ఆ మధ్య వీరసింహారెడ్డికి ఇదే లొకేషన్ లో అచ్చం ఇలాంటి సమస్యే వచ్చింది. పెద్ద బాలయ్య పాత్ర అంతిమయాత్ర సహజంగా ఉండాలనే ఉద్దేశంతో బురుజు పరిసరాల్లో తీయడంతో కీలకమైన ఆ విషయం ముందే తెలిసిపోయింది. ఇప్పుడు ఆర్సి 15కూ ఈ బెడద తప్పడం లేదు. శంకర్ జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుడు ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో నగరం నడిబొడ్డున భారీ ఎత్తున పబ్లిక్ పోగైన ఎపిసోడ్ ఖచ్చితంగా ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులతో చేయడం కన్నా ఇలానే ఇష్టపడతారు శంకర్. అప్పుడంటే లీకులు లేవు కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడలా కాదుగా.