పూరిపై ప్రచారం నిజమేనా హైపా

కెరీర్లో ఎప్పుడూ లేనంత బ్యాడ్ ఫేజ్ చూస్తున్న దర్శకుడు పూరి జగన్నాధ్ మెల్లగా లైగర్ తాలూకు గాయాలు జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సినిమా కేవలం డిజాస్టర్ కావడమే కాక పెట్టుబడులకు సంబంధించి ఫెమా అధికారులు విచారణ చేయడం ఇష్యూని సీరియస్ గా మార్చింది. దాని వల్ల తేలింది ఒరిగింది ఏమీ లేదు కానీ పూరి ఇప్పటిప్పుడు కొత్త ప్రాజెక్టు మొదలుపెడితే కానీ కోలుకునేలా లేడు. ఎటొచ్చి కాంబినేషనే పెద్ద సమస్య. మెట్టు దిగి చిన్న హీరోలతో చేయలేడు. షూటింగ్ ప్రారంభించిన జనగణమనే అర్ధాంతరంగా క్యాన్సిల్ అయ్యింది.

అలాంటప్పుడు కోరిమరీ ఎవరు ఛాన్స్ ఇస్తారు. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. అందులో మొదటిది బాలయ్యతో పూరి సినిమా ఉంటుందనే టాక్. పైసా వసూల్ ఫలితం నిరాశపరిచినా తనను చూపించిన తీరు నచ్చడంతో మరోసారి మంచి కథ కుదిరితే చేద్దామని బాలకృష్ణ రెండు మూడు సందర్భాల్లో అన్నారు. ఇప్పుడది పట్టాలెక్కే దిశగా వెళ్తోందనే లీక్ బయటకి వచ్చింది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న బాలయ్య ఆ తర్వాత ఎవరికి కమిటయ్యారనేది ఇంకా క్లారిటీ లేదు.

ఇంతకుముందు లిస్టులో పూరి పేరు లేదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైతం పూరి పట్ల సానుకూలంగా ఉన్నారని దానికి తగ్గట్టే ఇద్దరి మధ్య ఒక స్టోరీకి సంబంధించిన చర్చ జరిగిందని ఇంకో న్యూస్ వచ్చింది. గాడ్ ఫాదర్ ప్రమోషన్ టైంలో ఆ మేరకు చిరు హామీ ఇచ్చారు కానీ ఖచ్చితంగా అని ప్రకటించలేదు. గతంలో ఇదే కాంబినేషన్ లో ఆటో జానీ తెరకెక్కించాలని ప్రయత్నాలు జరిగాయి కానీ ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ నచ్చక ఆపేశారు. ఒకవేళ ఇక్కడ చెప్పిన ఇద్దరిలో ఏ ఒక్కరితో పూరికి సెట్ అయినా దశ తిరిగినట్టే. కాకపోతే దీన్నే డూ ఆర్ డై సిచువేషన్ గా తీసుకుని కసితో తీస్తే కంబ్యాక్ అవ్వొచ్చు.