సుకుమార్.. సిద్ధు.. ఒక లేడీ డైరెక్టర్

టాలీవుడ్లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి.. ముందు చిన్న చిన్న పాత్రలే చేసి.. ఆ తర్వాత హీరోగా కృష్ణ అండ్ హిజ్ లీల హిట్టు కొట్టి.. ‘డీజే టిల్లు’తో యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ. అడివి శేష్ లాగే రైటింగ్‌లోనూ ప్రతిభ చాటుకుని తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు సిద్ధు. ఇప్పుడతను హీరోగా తెరకెక్కుతున్న డీజే టిల్లు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’కు బంపర్ క్రేజ్ ఉంది.

ఈ వేసవిలోనే ‘టిల్లు స్క్వేర్’తో పలకరించబోతున్న సిద్ధు.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. కాస్త పేరున్న హీరోలు పుట్టిన రోజు జరుపుకుంటున్నారంటే.. వారి కొత్త ప్రాజెక్టులు ఆ రోజు అనౌన్స్ చేయడం ఆనవాయితీ. సిద్ధు విషయంలో కూడా అదే జరిగింది. అతను హీరోగా నటించనున్న ఒక క్రేజీ ప్రాజెక్టును ఈ రోజు ప్రకటించారు. ఈ సినిమాలో అగ్ర దర్శకుడు సుకుమార్ భాగస్వామి కావడం విశేషం.

ఓవైపు తన దర్శకత్వంలో భారీ సినిమాలు తీస్తూనే.. మరోవైపు వేరే నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో తన ప్రొడక్షన్లో తన శిష్యులకు దర్శకులుగా అవకాశమిస్తూ యువ కథానాయకులతో సినిమాలు తీస్తుంటాడు సుకుమార్. కుమారి 21 ఎఫ్, దర్శకుడు, ఉప్పెన, 18 పేజెస్ లాంటి చిత్రాలు ఈ కోవలోనివే. ఈ సినిమాలకు సుకుమార్ పేరు, ఆయన స్క్రిప్టులే పెట్టుబడి. డబ్బులు మాత్రం వేరే నిర్మాతలు పెడతారు.

ఇటీవలే నిఖిల్ సినిమా ‘18 పేజెస్’తో మంచి ఫలితాన్నే అందుకున్న సుకుమార్.. ఈసారి సిద్ధుతో జట్టు కడుతున్నాడు. సీనియర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ సంస్థ ‘ఎస్వీసీసీ’తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. వైష్ణవి అనే లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించనుండడం విశేషం. ఐతే ఈ చిత్రానికి కూడా సుకుమార్ కథ అందించాడా.. దర్శకురాలు సుకుమార్ శిష్యురాలేనా కాదా అన్నది ఇంకా వెల్లడి కాలేదు. సిద్ధు పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక పోస్టర్ ద్వారా ఈ సినిమాను ప్రకటించారు.