8 ఏళ్ళ తర్వాత విక్రమ్ సినిమాకు మోక్షం

ఏదో చిన్న హీరో పెద్దగా మార్కెట్ లేదు అందుకే షూటింగ్ పూర్తి చేయడం ఆలస్యమయ్యిందంటే అర్థముంది కానీ విక్రమ్ లాంటి క్రేజ్ ఉన్న స్టార్ కి ఎనిమిదేళ్లు గడిచినా మోక్షం దక్కలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. అది కూడా గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి కల్ట్ దర్శకుడి మూవీ.

2016లో ఈ కాంబోలో ధృవ నచ్చత్తిరమ్ మొదలయ్యింది. ముందు సూర్యతో ప్లాన్ చేసుకుని ఆ తర్వాత ఎందుకో అది ముందుకెళ్లక ఫైనల్ గా చియాన్ తో ప్రొసీడ్ అయ్యారు. ఏడు దేశాల్లో చిత్రీకరణ జరిపారు. కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చయ్యాయి. గౌతమ్ తో పాటు మరో ముగ్గురు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.

ఇందులో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. హరీష్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్తీబన్, అర్జున్ దాస్, రాధికా శరత్ కుమార్, సలీమ్ బైగ్ లాంటి నోటెడ్ క్యాస్టింగ్ ఉంది. మరి ఇన్ని హంగులు ఉన్నప్పుడు ఈ ధృవ నచ్చత్తిరమ్ ఎందుకు లేట్ అయ్యిందంటే ఆర్థిక కారణాల వల్ల. గౌతమ్ మీనన్ ఒక దశ దాటాక వ్యక్తిగతంగా దీని మీద ఆసక్తి చూపించకపోవడంతో క్రమంగా ఇది పక్కకెళ్ళిపోయింది. కట్ చేస్తే ఈయన నటుడిగా యమా బిజీ అయ్యాడు. పొన్నియన్ సెల్వన్ విజయం మళ్ళీ ఈ ప్రాజెక్టులో కదలిక తెచ్చింది

తాజాగా చెన్నైలో దీని బ్యాలన్స్ పార్ట్ ని పూర్తి చేసేసి గుమ్మడికాయ కొట్టారు. పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారట. అది కూడా ఈ ఏడాదే. అయినా ఇన్ని సంవత్సరాలు చెక్కితే ఇందులో మ్యాటర్ ఉంటుందా అంటే ఏమో వచ్చేదాకా చెప్పలేం. ఇదే తరహాలో కోబ్రాతో డిజాస్టర్ చవి చూసిన విక్రమ్ కు దీని మీద అట్టే ఆశలు ఉన్నట్టు కనిపించడం లేదు. ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు. ఏదైనా షాక్ ఇస్తుందేమో థియేటర్లో చూస్తే కాని అర్థం కాదు. అసలే డైరెక్టర్ గౌతమ్ మీనన్ పెద్దగా ఫామ్ లో లేరు. మరి దీంతో హిట్టు కొడతారో లేదో