జూనియర్ కాంబోతో కల్ట్ దర్శకుడు

ఒకపక్క కొరటాల శివ సినిమా ఎంత ఎదురు చూసినా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడం లేదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ మార్చిలో ఒక్కసారి సెట్స్ పైకి వెళ్ళాక ఇక ఆగేది ఉండదని యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్. రిలీజ్ ఇంకా ఏడాదికి పైగా టైం ఉన్న నేపథ్యంలో ఏ విషయంలోనూ రాజీ పడకూడదనే ఉద్దేశంతో తనకు సమయం కోణంలో తీవ్ర నష్టం జరుగుతున్నా తారక్ మౌనంగా భరిస్తున్నట్టు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోందన్న మాటే కానీ ఇంకా అఫీషియల్ కాలేదు.

దీని సంగతలా ఉంచితే కోలీవుడ్ కల్ట్ దర్శకుడు వెట్రిమారన్ చెప్పిన కథకు యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని లేటెస్ట్ అప్డేట్. అధికారికంగా చెప్పకపోయినా ఇద్దరూ ప్రత్యక్షంగా పలుమార్లు, ఫోన్లలో చాలాసార్లు ఈ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేసుకున్నారట. వెట్రిమారన్ ట్రాక్ రికార్డు గురించి తెలిసిందే. అయిదు సార్లు జాతీయ అవార్డు సాధించిన ఘనత తన స్వంతం. ఆడుకాలం(పందెం కోళ్లు), విసరణై(విచారణ), అసురన్(నారప్ప), వడ చెన్నై(తెలుగులో రాలేదు) చిత్రాల ద్వారా మారన్ సాధించిన ఖ్యాతి అనంతం. ప్రస్తుతం రెండు భాగాల విడుతలై పూర్త చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాడు

దీని తర్వాత కొత్త కమిట్ మెంట్స్ ఎవరికి ఇవ్వలేదు. అయితే ఒకవేళ తారక్ తో ఓకే అయినా తెరకెక్కడానికి టైం పడుతుంది. ఎందుకంటే కొరటాలది పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ మూవీ వెయిటింగ్ లో ఉంది. దాని తాలూకు సెట్ వర్క్ హైదరాబాద్ లో మొదలుపెట్టబోతున్నారు. ఇవి రెండు అయ్యేలోగా 2024 అయిపోతుంది. ఆపై ఏడాదే ఇంకే కొత్త సినిమా అయినా. అప్పటిదాకా వేచి చూడక తప్పదు. వెట్రిమారన్ విడుతలై మొదటి భాగం ఈ ఏడాది, సీక్వెల్ ని వచ్చే సంవత్సరం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో జూనియర్ వరసగా హై వోల్టేజ్ చిత్రాలే చేయబోతున్నాడు