పాపం గాంధీ గాడ్సేని పట్టించుకోలేదు

దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీకి పోటీకి వెళ్ళేటప్పుడు ప్రాక్టికల్ గా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతే తప్ప ఏదో సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకునో దేశభక్తిని క్యాష్ చేసుకుందామనో రిస్క్ చేస్తే దెబ్బ పడుతుంది. మొన్న శుక్రవారం రిలీజైన సినిమాలు ఏవంటే ఠక్కున గుర్తొచ్చే ఒకే ఒక పేరు పఠాన్. తెలుగులో సుధీర్ బాబు హంట్ లాంటివి వచ్చినా మన ఆడియన్స్ సైతం షారుఖ్ ఖాన్ ని చూసేందుకే ఇష్టపడటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లు దక్కుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో పఠాన్ ఆల్ టైం హిందీ నెంబర్ వన్ దిశగా పరుగులు పెడుతోంది.

అదే రోజు గాంధీ గాడ్సే ఏక్ యుధ్ కూడా రిలీజయ్యింది. పట్టించుకున్న నాథుడు లేకుండా పోయాడు. పోనీ తీసింది ఆషామాషీ దర్శకుడా అంటే కాదు. రెగ్యులర్ బాలీవుడ్ ఫాలోయర్స్ కి రాజ్ కుమార్ సంతోషి పేరుని కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఘాయల్, దామిని, అందాజ్ అప్నా అప్నా, బర్సాత్, ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్, ఖాకీ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన 90ల నాటి డైరెక్టర్. ఈయన ఆఖరి హిట్ 2009లో వచ్చిన అజబ్ ప్రేమ్ కి ఖజబ్ కహాని. 2013 ఫటా పోస్టర్ నిక్లా హీరో పెద్దగా ఆడలేదు. కట్ చేస్తే పదేళ్ల గ్యాప్ తీసుకుని ప్రత్యేకమైన రీసెర్చ్ చేసి మరీ గాంధీ గాడ్సే తో పలికరించారు.

గాంధీని హత్య చేసిన గాడ్సేతో పాటు ఇద్దరి మనస్తత్వాలను విభిన్న కోణంలో పరిచయం చేస్తూ అప్పటి సామజిక రాజకీయ వాతావరణాన్ని కొత్తగా చూపించే ప్రయత్నంలో రాజ్ కుమార్ సంతోష్ ఓ మోస్తరుగా ఓకే అనిపించారు కానీ పఠాన్ చూసే మూడ్ లో ఉన్న ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేయడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో కంటెంట్ ఓ మోస్తరుగా ఉన్నా గాంధీ గాడ్సే జనానికి చేరలేదు. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అవ్వడంతో పాటు కొన్ని సెంటర్లలో దీన్ని తీసేసి పఠాన్ కి ఇచ్చారు. అయినా బాద్షా మేనియా ముందు ఎవరైనా ఆగడం కష్టమే. పైగా ఎవరికీ ఆసక్తి లేని కాన్సెప్ట్ తో.