100 కోట్ల సినిమాని అలా వదిలేశారేం

కంటెంట్ బాగుంటే స్టార్లు ఉన్నారా లేదాని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. నచ్చితే చాలు కిరీటం పెట్టి హిట్టు కొట్టిస్తున్నారు. డబ్బింగ్ అనే తేడాను సైతం పట్టించుకోవడం లేదు. కాంతార కంటే మంచి ఉదాహరణ అక్కర్లేదు.

ఎక్కడో మనకు సంబంధమే లేని కర్ణాటక ఆచారాన్ని, దేవుడి నమ్మకాన్ని దర్శకుడు రిషబ్ శెట్టి చూపించిన తీరు తెలుగులోనూ కనకవర్షం కురిపించింది. దీని మీద పెద్ద నమ్మకం లేక షేర్ పర్సెంటెజ్ పద్ధతి మీద పంపిణి చేసిన నిర్మాత అల్లు అరవింద్ తర్వాత ఫలితం చూసి షాక్ తిన్నారు. ఈ క్రమంలోనే మాలికాపురం అనే మరో అనువాద చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తీసుకొచ్చారు.

మళయాలంలో ఇటీవలే రిలీజై పెద్ద హిట్ గా నిలిచి వంద కోట్ల మైలురాయిని ఈజీగా అందుకుంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. ఇతను ఎవరో కాదు. సమంతా యశోదలో డాక్టర్ గా నెగటివ్ క్యారెక్టర్ చేశాడు. అంతకు ముందు అనుష్క భాగమతిలోనూ ఉన్నాడు. అయ్యప్ప మాలాధారుల కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు విష్ణు శశిశంకర్ దానికి ఫ్యామిలీ అండ్ ప్లస్ చైల్డ్ సెంటిమెంట్ జోడించడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. గత నెల డిసెంబర్ 30న రిలీజైతే ఇప్పటికీ కేరళలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. అందుకే మనకు డబ్ చేశారు.

ఇంత జరిగినా మాలికాపురం వచ్చిందన్న సంగతే ఇక్కడి పబ్లిక్ కి రిజిస్టర్ కానంత వీక్ గా ప్రమోషన్లు లైట్ తీసుకున్నారు. దీంతో ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి. పఠాన్ జోరు ఎంత ఉన్నా, హంట్ కి పెద్దగా బజ్ లేని అడ్వాంటేజ్ ని ఈ సినిమా వాడుకోలేకపోయింది. ఇదే తమిళ వెర్షన్ కి టీమ్ మొత్తం చెన్నై వెళ్లి ప్రెస్ మీట్ నిర్వహించి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. కానీ తెలుగులో మాత్రం అలాంటి ఊసేదీ లేదు. అయ్యప్ప భక్తులు ఏపీ తెలంగాణలో లక్షల్లో ఉన్నారు. ఇది వాళ్లకు చేరినా మంచి వసూళ్లు వస్తాయి. మరి ఇంత పొటెన్షియాలిటీ పెట్టుకుని ఎందుకు వదిలేసినట్టో