ఒక వివాదం ముగిసింది.. ఇంకోటి మొదలైంది

నందమూరి-అక్కినేని కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా నడుస్తున్న గొడవ సంగతి తెలిసిందే. ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ అనే వ్యాఖ్య చేయడం పెద్ద దుమారమే రేపింది. ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ బాగానే హర్టయ్యారు. వారికి బాలయ్య వ్యతిరేకులంతా తోడవడంతో సోషల్ మీడియాలో రోజు రోజుకూ వివాదం రోజు రోజుకూ ముదురుతూ వచ్చింది. ఈ వ్యాఖ్యలపై బాలయ్య క్షమాపణ చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపించింది.

ఐతే ఈ రోజు బాలయ్య మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. ఏఎన్నార్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ఆయన్ని బాబాయ్ అని పిలుస్తానని.. తనతో ఆయన ఎంతో ఆప్యాయంగా ఉండేవారని.. ఏదో ఫ్లోలో అలా మాట్లాడేశా తప్ప ఏఎన్నార్‌ను కించపరిచే ఉద్దేశం ఏమీ లేదని బాలయ్య తేల్చేశాడు.

ముందు నుంచి బాలయ్య అభిమానులు చెబుతున్న మాట కూడా ఇదే. ఏఎన్నార్‌తో బాలయ్యకు ఉన్న అనుబంధం, వివిధ సందర్భాల్లో ఏఎన్నార్‌ మీద బాలయ్య చూపించిన అభిమానాన్ని గుర్తు చేస్తూ ఆయన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. ఐతే ఏఎన్నార్‌కు, తనకు మధ్య ఉన్న అనుబంధం వరకు చెప్పి బాలయ్య ఆపేస్తే సరిపోయేది. వివాదానికి అంతటితో తెరపడేది. కానీ సొంత పిల్లల కన్నా ఎక్కువగా తన మీద ప్రేమ చూపించేవారని.. అక్కడ ఆప్యాయత లేదు కాబట్టి, తన దగ్గర ఉంది కాబట్టే తనతో ప్రేమగా ఉండేవారు అన్నట్లుగా బాలయ్య మాట్లాడడంతో కొత్త వివాదం తప్పలేదు.

పరోక్షంగా నాగార్జునను, ఆయన తోడ బుట్టిన వారిని, ఆయన పిల్లల్ని బాలయ్య కౌంటర్ చేస్తున్నారన్నది స్పష్టంగా అర్థమైపోతోంది. ఒక రకంగా ఏఎన్నార్‌ను వాళ్లు సరిగా చూసుకోలేదు అన్నట్లుగా బాలయ్య మాట్లాడేశాడు. ఇది అక్కినేని కుటుంబ సభ్యులకు ఆగ్రహం తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. అక్కినేని ఫ్యాన్స్‌కు కూడా ఇది రుచించని మాటే. సింపుల్‌గా వివాదానికి తెరదించుతాడనుకుంటే బాలయ్య మళ్లీ కొత్త కాంట్రవర్శీ క్రియేుట్ చేశాడేంటా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.