డబ్బింగ్ సినిమాకు ఇంత రేటా?

సంక్రాంతి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో బాగానే సందడి చేశాయి. ముఖ్యంగా ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు అంచనాలను మించి వసూళ్లు రాబట్టాయి. అనువాద చిత్రం ‘వారసుడు’ కూడా ఉన్నంతలో బాగానే ఆడింది. చిరు, బాలయ్యల సినిమాలకున్న డిమాండును బట్టి, పైగా సంక్రాంతి సీజన్ కాబట్టి వాటికి టికెట్ల రేట్లు పెంచారు. అయినా సరే జనాలు పెద్దగా ఫీలవ్వలేదు.

తొలి వారం ఎక్కువ రేటు పెట్టే థియేటర్లకు వెళ్లారు. కానీ ప్రభుత్వం ఈ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది వారం నుంచి పది రోజుల వరకే. పండుగ టైంలో డిమాండ్ ఉంది కాబట్టి రేట్లు పెంచుకున్నారులే అనుకోవచ్చు. కానీ రెండో వారంలో కూడా అవే రేట్లను కొనసాగిస్తున్నారు ఎగ్జిబిటర్లు. సెకండ్ వీకెండ్ అయిపోయి.. సోమవారం నాటికి థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు అయినా రేట్లు తగ్గిస్తే ఇటు ఎగ్జిబిటర్లకు, అటు ప్రేక్షకులకు ఉభయతారకంగా ఉండేది. కానీ అలా చేయలేదు. నిన్నటిదాకా ఉన్న రేట్లనే కొనసాగిస్తున్నారు.

ఇంతకుముందు ఇలా అయినకాడికి రేట్లు పెంచి టికెట్లు అమ్మడం వల్ల ఒక టైంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయింది. ఆక్యుపెన్సీలు బాగా పడిపోయాయి. దీంతో మధ్యలో కొంచెం కంగారు పడి రీజనబుల్ రేట్లతో టికెట్లు అమ్మడం మొదలుపెట్టారు. కానీ పరిస్థితి కొంచెం మెరుగుపడేసరికి మళ్లీ పాత కథ పునరావృతం అయ్యేలా కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలకు రెండో వీకెండ్ తర్వాత కూడా అధిక రేట్లను కొనసాగించడం అందుకు నిదర్శనం. ఈ సినిమాలను చూసి షారుఖ్ ఖాన్ నటించిన డబ్బింగ్ మూవీ ‘పఠాన్’కు అధిక రేట్లకే టికెట్లు అమ్ముతుండడం గమనార్హం.

హైదరాబాద్‌లో ‘పఠాన్’ తెలుగు వెర్షన్‌కు సింగిల్ స్క్రీన్లలో రూ.175తో, మల్టీప్లెక్సుల్లో రూ.295తో టికెట్లు అమ్ముతున్నారు. ఒక డబ్బింగ్ మూవీకి ఇంత రేటు పెట్టి వెళ్లాలంటే ప్రేక్షకులకు ఎలా మనసొప్పుతుంది? హిందీ వెర్షన్‌కు ఉండే డిమాండ్ వేరు కాబట్టి ఆ రేట్లు ఓకే అనుకుందాం. కానీ తెలుగు వెర్షన్‌తో ఎక్కువమందిని థియేటర్లకు రప్పించాలంటే.. సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో రూ.200 రేటు పెట్టాల్సింది. దాని వల్ల మంచి ఆక్యుపెన్సీలు వచ్చి ఉండేవి. కానీ అత్యాశకు పోయి ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది.