వీరయ్య వేడుక అందుకే ఆలస్యం

నిన్న వీరసింహారెడ్డి విజయోత్సవాన్ని హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించాక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య ఈవెంట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. రెండు సినిమాలకు సంబంధించి ప్రమోషన్లు పబ్లిసిటీ బ్యాలన్స్ చేసుకుంటూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఇంత పెద్ద విజయాన్ని సెలెబ్రేట్ చేయకుండా ఉండలేరు.

అయితే ఆలస్యానికి సంబంధించిన కారణాలు కొన్ని అర్థమవుతున్నాయి. అందులో మొదటిది వంద కోట్ల షేర్ ని అధికారికంగా ప్రకటించడం. దగ్గరగా ఉంది కానీ ఇంకా అందుకోలేదు కాబట్టి ఆ మార్కు చేరుకున్నాక ఏ డేట్ చేయాలనేది నిర్ణయిస్తారట.

వాల్తేరు వీరయ్య యుఎస్ లోనూ 2.5 మిలియన్ల వైపు పరుగులు పెడుతోంది. త్వరగా చేరుకునే పక్షంలో దీన్ని కూడా వేడుకలో కలిపేయొచ్చు. ఈ రెండు మైలురాళ్లు కీలకమైనవి కాబట్టి ఒక్కసారి రీచ్ కాగానే మిగిలిన పనులు పూర్తి చేస్తారు. పైగా రవితేజ రావణాసుర, చిరంజీవి భోళా శంకర్ షూటింగ్ లలో బిజీ ఉన్నారు. శృతి హాసన్ అందుబాటులోకి రావాల్సి ఉంది.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని అందరూ హాజరయ్యేలా దీన్నే వీలైనంత గ్రాండ్ గా స్పెషల్ గా చేయాలనే ప్లాన్ లో మైత్రి ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇదే చివరి వేడుక అవుతుంది.. ఎక్కడ ఎలా చేసినా ముందైతే మెగాస్టార్ అంగీకారం తీసుకోవాలి.

ఇవన్నీ జరగడానికి ఒక వారం పట్టొచ్చు. పండగ సెలవులతో పాటు మొదటి పది రోజులు అయిపోయాయి కాబట్టి రేపు ఎల్లుండి డ్రాప్ ఎంత ఉంటుందనే దాన్ని బట్టి వాల్తేరు వీరయ్య జోరు ఎక్కడ ఆగుతుందనే క్లారిటీ వస్తుంది. అనుమతి తెచ్చుకున్న పెంచిన టికెట్ రేట్లను ఇవాళ్టి నుంచి సాధారణ స్థితికి తేవడంతో మళ్ళీ వసూళ్లు ఊపందుకునే అవకాశాలు లేకపోలేదు.

ఇదంతా బాగానే ఉంది కానీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ని ప్రమోట్ చేసే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో నార్త్ లో ఆశించిన ఫలితాలు అందలేదు. సైరా కోసం ముంబై వెళ్లిన చిరు టీమ్ వీరయ్యను మాత్రం లైట్ తీసుకోవడం విశేషం