ప‌వ‌న్ కొత్త సినిమా.. సైలెంటుగా

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమాలు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి అనౌన్స్ అయిపోతున్నాయి కానీ.. ఏది ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో మాత్రం తెలియ‌ట్లేదు. గ‌త ఏడాది చివ‌ర్లో సుజీత్ సినిమాతో పాటు హ‌రీష్ శంక‌ర్ మూవీని కొత్త‌గా అనౌన్స్ చేయ‌డం తెలిసిందే. ఒక‌టేమో అనౌన్స్‌మెంట్‌కే ప‌రిమితం కాగా.. ఇంకోదానికి ముహూర్త వేడుక కూడా చేశారు. కానీ ఆ సినిమాలు అక్క‌డి నుంచి ముందుకు మాత్రం క‌ద‌ల్లేదు. కాగా ఇప్పుడు మ‌రో కొత్త సినిమాను ప‌వ‌న్ తెర‌మీదికి తెస్తున్న‌ట్లు స‌మాచారం.

ఐతే ఈ సినిమాకు అనౌన్స్‌మెంట్, ముహూర్తం లాంటివేమీ ఉండ‌వ‌ట‌. నేరుగా సెట్స్ మీదికి తీసుకెళ్లిపోనున్నార‌ట‌. ఏడాది కింద‌ట్నుంచి చ‌ర్చ‌ల్లో ఉన్న వినోదియ సిత్తం రీమేకే ప‌వ‌న్ సెట్స్ మీదికి తీసుకెళ్ల‌నున్న కొత్త సినిమా అని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

సంక్రాంతి త‌ర్వాత ఈ చిత్రం ప‌ట్టాలెక్కుతుంద‌ని ఇంత‌కుముందే వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ ఇంకొన్ని రోజుల్లోనే వినోదియ సిత్తం రీమేక్‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ట మేక‌ర్స్. త‌మిళ వెర్ష‌న్ ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌నినే తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌నుండ‌గా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. భీమ్లానాయ‌క్ లాగే దీనికి కూడా స్క్రిప్టు అందిస్తున్న‌ది త్రివిక్ర‌మ్ శ్రీనివాసే. మాట‌లు, మార్పులు, స్క్రీన్ ప్లే క్రెడిట్ ఆయ‌న‌కే వెళ్ల‌నుంది.

ప‌వ‌న్ ఇందులో దైవ దూత పాత్ర చేయ‌నుండ‌గా.. సాయిధ‌ర‌మ్ తేజ్ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. త‌మిళంలో తంబిరామ‌య్య చేసిన న‌డి వ‌య‌స్కుడి పాత్ర‌ను కుర్రాడిగా మార్చి అందులో తేజును న‌టింప‌జేయ‌నున్నారు. ప‌వ‌న్ ఈ సినిమా కోసం అటు ఇటుగా మూడు వారాల డేట్లే ఇచ్చాడ‌ట‌. త‌క్కువ బ‌డ్జెట్, వ‌ర్కింగ్ డేస్‌లో ఈ సినిమాను పూర్తి చేయాల‌ని అనుకుంటున్నారు.