స‌రోగ‌సీ కామెంట్ల‌పై ప్రియాంక హ‌ర్టు

సెలబ్రెటీలు, ధనవంతులైన మహిళలు సరోగసీ మార్గంలో బిడ్డల్ని కనడం మీద ఈ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. గర్భం దాల్చి బిడ్డను కంటే తమ అందం దెబ్బ తింటుందని, డెలివరీ సమయంలో బాధను భరించలేమనే ఉద్దేశంతోనే సరోగసీకి వెళ్తున్నారనే ఆరోపణలు సెలబ్రెటీల మీద బలంగా వినిపిస్తున్నాయి.

నిక్ జోనాస్‌ను పెళ్లాడిన బాలీవుడ్ భామక ప్రియాంక చోప్రా సైతం ఈ ఉద్దేశంతోనే సరోగసీకి వెళ్లిందనే సందేహాలు ఆ మధ్య వ్యక్తమయ్యాయి. ఐతే ఈ కామెంట్లు తనను ఎంతగానో బాధించినట్లు ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తాము సరోగసీకి వెళ్లడానికి కారణాలు వేరని ఆమె స్పష్టం చేసింది.

” నా అందం దెబ్బ తింటుందనే సరోగసీ ద్వారా బిడ్డను కన్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్లు చూసి చాలా బాధ పడ్డా. కానీ వాస్తవం వేరు. మేమేమీ కావాలని సరోగసీకి వెళ్లలేదు. నాకు వైద్యపరమైన సమస్యలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరోగసీని ఎంచుకోవాల్సి వచ్చింది. మా బిడ్డను గర్భంలో మోయడానికి అంగీకరించిన మహిళ ఎంతో దయగలిగింది. కొన్ని నెలల పాటు వెతికాక మాకు ఆమె దొరికింది. దాదాపుగా ఆరు నెలల పాటు మా బిడ్డను ఆమె జాగ్రత్తగా కాపాడింది.

మా పాప నిర్ణీత వ్యవధి కంటే మూడు నెలల ముందే జన్మించింది. ఆమె పుట్టినపుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆ సమయంలో పాప బరువు చాలా తక్కువ. నా చేతి కంటే చిన్నగా ఉండేది. ఆమెను చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. మాకు బిడ్డను కని ఇచ్చిన మహిళ పేరు కలిసొచ్చేలా పాపకు మాల్దీ అని పేరు పెట్టుకున్నాం. నా చిన్నారికి సంబంధించి ఎటువంటి గాసిప్స్ చదవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీడియాకు దూరంగా చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం. ” అని ప్రియాంక తెలిపింది.