మిషన్ మజ్ను పాస్ అయ్యాడా

సౌత్ నుంచి ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నా హీరోయిన్లకు బాలీవుడ్ సినిమా చేస్తే అదో స్పెషల్ కిక్కు. కాకపొతే టైం కలిసిరాక హిట్లు పడవు అంతే. రష్మిక మందన్న గత ఏడాది అమితాబ్ బచ్చన్ గుడ్ బైతో తెరంగేట్రం చేస్తే ఫలితం తేడా కొట్టేసింది. సరే పోతే పోయిందని మిషన్ మజ్ను మీద గంపెడాశలు పెట్టుకుంది. పెద్ద బడ్జెట్ తోనే తీశారు కానీ ముందు థియేటర్ అనుకున్న నిర్మాతలు తర్వాత నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ కు మతిపోయి డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు ఓకే అనేశారు. దాంతో జనవరి 20 నేరుగా ఇది ప్రేక్షకుల స్మార్ట్ స్క్రీన్లపైకి వచ్చేసింది. రష్మిక కాబట్టి మన ఆడియన్స్ కీ దీని మీద ఆసక్తి ఉంది

కథా నేపథ్యం 1970 ప్రాంతంలో సాగుతుంది. ఇండియా పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షను జరిపిన తర్వాత పాకిస్థాన్ ఆ విజయం పట్ల దుగ్దతో రగిలిపోతూ అణుబాంబు తయారీ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అక్కడ సీక్రెట్ స్పైగా తారిఖ్ పేరుతో గూఢచర్యం చేస్తుంటాడు అమన్ దీప్ సింగ్(సిద్దార్థ్ మల్హోత్రా). శత్రుదేశం తలపెట్టిన దుశ్చర్యను ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో దాని కోసం దర్జీ వేషం వేసుకుని బ్రతుకుతుంటాడు. ప్రేమించిన అమ్మాయి(రష్మిక మందన్న)కి కళ్ళు లేకపోయినా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. మరి అమన్ భారత ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను ఎలా నెరవేర్చాడనేదే మిషన్ మజ్ను స్టోరీ

దర్శకుడు శంతను బాగ్చి హాలీవుడ్ మూవీ నైట్ క్రాలర్ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు కానీ ఇదే ఛాయల్లో అలియా భట్ రాజీ, జీ 5 వెబ్ సిరీస్ ముఖ్బీర్ లు గతంలోనే వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ సెటప్ అంతా నీట్ గా సెట్ చేసుకున్న శంతను స్క్రీన్ ప్లే విషయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడంతో నమ్మశక్యం కాని విధంగా కథనం సాగుతుంది. దానికి తోడు అవసరానికి మించిన లవ్ ట్రాక్, పాటలు చికాకు పెడతాయి. థ్రిల్లింగ్ గా ఉండాల్సిన టెంపోని చప్పగా నడిపించారు. ఆర్టిస్టులందరూ బాగానే చేశారు కానీ టేకింగే కృత్రిమంగా ఉంది.విపరీతమైన ఖాళీ టైం ఉంటేనే ఈ మిస్టర్ మజ్నుని ట్రై చేయొచ్చు